ఖలీల్వాడి, నవంబర్ 28 : ఇందూరు నగరంలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మునుపెన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున నిధులను ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలిపారు. గడిచిన 50 ఏండ్లలో మంజూరైన నిధుల కన్నా ఎనిమిదేండ్ల వ్యవధిలోనే మూడింతలు ఎక్కువ నిధులు ఖర్చు చేశామని మంత్రి వివరించారు. నిజామాబాద్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆదివారం నిర్వహించిన సమీక్షలో ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మంత్రి వేము ల సోమవారం నిజామాబాద్ నూతన కలెక్టరేట్లో నిజామాబాద్ రూరల్, అర్బన్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్గుప్తా, మేయర్ నీతూకిరణ్, కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పురోగతిలో ఉన్న ఆయా పనుల ప్రగతి, చేపట్టాల్సిన పనులకు స్థల సేకరణ, బిల్లుల చెల్లింపుల పరిస్థితి, నిధుల లభ్యత తదితర అంశాలపై క్షుణ్ణంగా సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రెండు నెలల్లో సీఎం కేసీఆర్ అభివృద్ధి పనుల పరిశీలన కోసం నగర పర్యటనకు రానున్నారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని సీఎం పర్యటనకు ముందే అన్ని పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. నిరంతరం పర్యవేక్షించాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను మంత్రి ఆదేశించారు.
ప్రగతి పనులకు నిధుల కొరత లేదని, పనులు పూర్తిచేయించిన వెంటనే నిధులు మంజూరు చేయిస్తామన్నారు. వెజ్, నాన్వెజ్ సమీకృత మార్కెట్ యార్డులు, వైకుంఠధామాలు, మినీ ట్యాంక్బండ్, పట్టణ ప్రగతి కింద చేపడుతున్న పనులు, సీఎం ఇచ్చిన హామీలకు సంబంధించిన పనులు, దోబీఘాట్లు తదితర నిర్మాణాలను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపల్ పరిధిల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి అధికారులతో సమీక్షించారు. అనంతరం రక్తపోటు, మధుమేహం బాధితులకు ప్రభుత్వం ఉచితంగా అందజేసిన ఎన్సీడీ కిట్లను విడుదల చేశారు.
నగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం..
ఇందూరు నగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి వేముల పేర్కొన్నారు. సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎనిమిదేండ్లలో ఒక్క నిజామాబాద్ నగరానికే అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.936.69 కోట్ల మం జూరీ తెలిపిందన్నారు. ఇందులో రూ.884 కోట్ల నిధులకు సాంకేతిక అనుమతి లభించగా, ఇప్పటికే రూ.658.91 కోట్లను వివిధ పనుల కోసం ఖర్చు చేసినట్లు తెలిపారు. టీయూఎఫ్ఐడీసీ కింద రూ. 190 కోట్లు, సీఎం హామీలకు సంబంధించి రూ. 170.82 కోట్లు, పట్టణ ప్రగతి కింద రూ.76.05 కోట్లు, మిషన్ భగీరథ పనుల కోసం రూ.116 కోట్లు, 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ.75.37 కోట్ల నిధులను ఖర్చు చేశామని వివరించారు. తాము అడుగక ముందే నిజామాబాద్ నగర ప్రగతిపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారని, అభివృద్ధి పనులకు మరిన్ని నిధులు కేటాయించేందుకు సంసిద్ధత తెలిపారన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి స్థల పరిశీలన
నగరంలో నూతనంగా నిర్మించే ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం కోసం సోమవారం రాత్రి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి పలు స్థలాలను పరిశీలించారు. పాత కలెక్టరేట్ వెనుక భాగంలో ఆర్అండ్బీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా, మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయాలకు ఆనుకుని ఉన్న ఇరిగేషన్ క్వార్టర్లను కాలినడకన సందర్శిస్తూ నిశితంగా పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు ఆయా సముదాయాల గురించి అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు.