నిజామాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లాలో పారిశ్రామిక ప్రగతి జోరుందుకున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. 24గంటల విద్యుత్ సరఫరా చేస్తుండడంతో అనేక మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడుతున్నారని చెప్పా రు.యూనిట్లను నిరంతరంగా నడుపుకుంటున్నారని, కొత్తగా యూనిట్లను నెలకొల్పుతున్నారని తెలిపారు. దీంతో ఉపాధి పెరిగి, ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోందన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన ‘పారిశ్రామిక ప్రగతి ఉత్సవం’లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో టీఎస్ ఐపాస్ (తెలంగాణ పారిశ్రామిక విధానం)లో పెనుమార్పులు వచ్చాయని తెలిపారు. గతంలో పరిశ్రమ పెట్టాలంటే చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేదని, తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్లు గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేవారికి అనుకూలంగా సర్కార్ టీఎస్ ఐపాస్ విధానాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో రూ.900 కోట్ల విలువతో 777 యూనిట్లకు అనుమతులు ఇవ్వగా 13వేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు.
భగీరథ నీరు పదిశాతం పారిశ్రామిక రంగాలకు..
మిషన్ భగీరథలో 10శాతం నీటి వినియోగాన్ని పారిశ్రామిక రంగాలకే కేటాయించిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని మంత్రి వేముల పేర్కొన్నారు. తాను మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా ఉన్నప్పుడే ఈ విధానం అమల్లోకి వచ్చిందని తెలిపారు. పారిశ్రామికీకరణతో ఉద్యోగాల సృష్టి జరగాలంటే టీఎస్ ఐపాస్ ఒకటే సరిపోదని సీఎం గుర్తించి.. పరిశ్రమలు నిలదొక్కుకునేందుకు అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. కావాల్సిన వనరులతో పాటు అద్భుతమైన పోలీసింగ్తో శాంతి, భద్రతలను అదుపులో పెట్టారన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో మన రాష్ట్రం ముందున్నదని తెలిపారు.
వీడియో ప్రదర్శన ద్వారా అవగాహన
రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ కంపెనీల స్థాపనలో మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి వెలకట్టలేనిదన్నారు. దేశంలోని మరే రాష్ట్రంలో కూడా కేటీఆర్ మాదిరిగా పెట్టుబడులను ఆకర్షించడం లేదని పేర్కొన్నారు. దేశానికి పరిశ్రమలు తేవడానికి మోదీ కన్నా ఎక్కువ కేటీఆర్ శ్రమిస్తున్నారని చెప్పారు. ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీలుగా పేరొందిన పారిశ్రామిక వేత్తల ప్రసంగాలను వీడియో రూపంలో సభికులకు చూపించారు. కేటీఆర్ పడుతున్న శ్రమను, స్వయంగా పారిశ్రామిక వేత్తలు చెప్పిన విషయాలను మంత్రి వేముల కళ్లకు కట్టినట్లు వివరించారు.
మోదీ కన్నా ఎక్కువగా శ్రమిస్తున్న కేటీఆర్
తెలంగాణ పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్ పడుతున్న శ్రమలో దేశ ప్రధాని మోదీ సగం శ్రమించినా దేశ జీడీపీ కనీసం 4శాతం ఎగబాకేదని మంత్రి వేముల అన్నారు. ఇది వాస్తవమని పేర్కొన్నారు. కరోనా సమయంలో తెలంగాణ వృద్ధి రేటు స్థిరంగా ఉంటే.. దేశ జీడీపీ మాత్రం రుణాత్మకమైన వృద్ధిని సాధించిందని చెప్పారు. తెలంగాణ మాదిరిగానే..కేంద్ర ప్రభుత్వం పని చేసి ఉంటే ఎంతో బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఐటీ రంగంలో 2014లో తెలంగాణ ఎగుమతులు రూ.57వేల కోట్లు ఉంటే.. ప్రస్తుతం రూ.2.44లక్షల కోట్లకు పెరిగిందన్నారు. దాదాపుగా నాలుగు రెట్లు పెరిగిందని చెప్పారు.
ఐటీ రంగంలో 9లక్షల మందికి ఉద్యోగావకాశాలు
ఐటీ రంగంలో ఒకప్పుడు 3లక్షల మందికి ఉపాధి ఉంటే 2023 నాటికి 9లక్షల మం దికి చేరిందన్నారు. ప్రపంచంలోనే టాప్ 5 ఐటీ కంపెనీలు..వాటి మొదటి ఆఫీస్ వాళ్ల దేశంలో ఉంటే రెండో ఆఫీస్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి కేటీఆరే కారణమని మంత్రి అన్నారు. గడిచిన తొమ్మిదేండ్లలో రూ.3లక్షల కోట్ల విలువతో 20వేల కొత్త పరిశ్రమలు స్థాపించబడ్డాయని, తద్వారా 18లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు వివరించారు. సమావేశంలో మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.