ముప్కాల్, జూన్ 7 : అరవై ఏండ్ల సాగునీటి గోసను తీర్చిన దార్శనికుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ముప్కాల్ మండలంలోని ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్ జీరో పాయింట్ పంపుహౌస్ వద్ద బుధవారం నిర్వహించిన సాగునీటి దినోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా 310కి.మీ పైకి, 200 కి.మీ సొరంగాల ద్వారా, 1531 కి.మీ కాలువల ద్వారా, 16 రిజర్వాయర్ల ద్వారా వచ్చిన కాళేశ్వరం జలాలు పంప్ చేసుకొని పోచంపాడ్ ప్రాజెక్టును నింపుకొంటున్నామన్నారు. అక్కడి నుంచి లిఫ్టులు, కెనాల్స్ ద్వారా ఊరూరా చెరువులు, కుంటలు నిండుతున్నాయని వివరించారు. మండుటెండల్లో చెరువులు అలుగులు పారుతున్నాయంటే సీఎం కేసీఆర్ చొరవేనని మంత్రి పేర్కొన్నారు.
గోదావరిలో వృథాగా పోతున్న నీటిని కాళేశ్వరం వద్ద ఒడిసిపట్టి, అక్కడి నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువ గుండా ఎస్సారెస్పీ నింపుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ముప్కాల్ పంప్హౌస్ జీరో పాయింట్ వద్ద విజయోత్సవ సభ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ముప్కాల్ పంప్హౌస్ కోసం రూ.610 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. బాల్కొండ నియోజకవర్గంలో గుత్ప, బోదేపల్లి, నాగాపూర్, జలాల్పూర్, చౌట్పల్లి హన్మంత్రెడ్డి, గుమ్మిర్యాల్ లిఫ్టుల ద్వారా ఊరూరా చెరువులు నింపుతున్నట్లు వివరించారు. ప్యాకేజీ 21 ద్వారా భీమ్గల్,వేల్పూర్,కమ్మర్పల్లి,మోర్తాడ్ మండలాల్లోని సుమారు 80 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. సుమారు రూ.100కోట్లకు పైగా ఖర్చుతో పెద్దవాగు, కప్పల వాగు మీద 24 చెక్డ్యాములు నిర్మించామని, వాటితో బోర్లు రీ జనరేట్ అయ్యి, 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నదన్నారు. చిట్టాపూర్ లిఫ్ట్ పురోగతిలో ఉన్నదని వెల్లడించారు.
తొమ్మిదేండ్ల క్రితం సాగునీటి కష్టాలతో మన బతుకులు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా మారాయో ఒక్కసారి రైతులు గుండెమీద చెయ్యి వేసుకొని ఆలోచన చేయాలని మంత్రి కోరారు. ప్రతిపక్షాల మాటలు విని మోసపోతే మళ్లీ గోసపడేది మనమేనని, రైతుబాగు కోరే కేసీఆర్కు మనమంతా మద్దతుగా నిలబడాల్సిన బాధ్యత ఉన్నదని మంత్రి వేముల రైతులకు పిలుపునిచ్చారు. అంతకుముందు తెలంగాణ ఏర్పాటుకు ముందు సాగు నీటి కోసం గోస పడ్డ పరిస్థితుల నుంచి రాష్ట్రం ఏర్పాటయ్యక కేసీఆర్ నాయకత్వంతో సాగునీటి రంగంలో సాధించిన విప్లవాత్మక విజయాలపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం, ప్యాకేజీ 21పై రూపొందించిన డాక్యుమెంటరీ వీడియోలను పెద్ద స్క్రీన్లపై మంత్రి స్వయంగా రైతులకు చూపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం సీఎం కేసీఆర్ చేసిన మేధోమథనం, పడ్డ కష్టం రైతులకు కూలంకషంగా వివరించారు. రైతులు స్క్రీన్పై వీడియో చూస్తూ చప్పట్లతో హర్షం వ్యక్తం చేస్తూ మద్దతు పలికారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ సీఈ మధుసూదన్రావు, ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.
తలాపున పారుతుంది గోదారి.. మన చేను, మన చెలుక ఎడారి అని నాడు పాటలు పాడుకున్నాం.. ప్రస్తుతం మండుటెండల్లోనూ చెరువులు, చెక్డ్యాములు, కాలువలు, రిజర్వాయర్లు నిండుగా ఉండడంతో రైతులంతా సంబురంగా ఉన్నారు. ఇదంతా ఊరికే కాలేదు. కేసీఆర్ నిర్విరామ కృషి, అకుంఠిత దీక్ష వల్లే సాధ్యమయ్యింది. సమైక్యపాలనలో ఎండిన బోర్లు, బీడు భూములు ఎక్కిరించేవి. నేడు చెరువులు, కుంటలు, బోరుబావులు, కాలువలు ఫుల్లు నీళ్లతో కళకళలాడుతున్నాయి. దీంతో పంటలు ఫుల్గా పండుతున్నాయి.
ఒకప్పుడు మొగులుకు మొఖం పెట్టి చూసినం… కానీ ఇప్పుడు ఎండాకాలంలో కూడా ఊర్లల్లో చెరువులు నిండుకుండలా ఉన్నాయి. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన కృషితో వేల ఎకరాల పడావు భూములు సాగులోకి వచ్చాయి. వాగుల మీద చెక్డ్యాంలు కట్టించి.. ఎండిన బోర్లలో నీళ్లు వచ్చేలా చేశారు. రెండు పంటలకు నీళ్లు పుష్కలంగా అందుతున్నాయి. గతంలో ఎవ్వరూ సాగునీటి కోసం ఇంతలా పనిచేయలేదు. కేవలం కేసీఆర్ ప్రభుత్వం, మంత్రి ప్రశాంత్ రెడ్డితోనే నేడు బాల్కొండ నియోజకవర్గం సస్యశ్యామలం అయ్యింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నది.
– సాగునీటి దినోత్సవంలో పాల్గొన్న పలువురు రైతుల మనోగతం