ప్రతిపాదనలు సిద్ధం చేయండి
విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
వర్షాల నేపథ్యంలో బాల్కొండ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో మంత్రి వేముల సమీక్ష
వేల్పూర్, జూలై 15: బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులతో రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్లోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు గ్రామాల్లో దెబ్బతిన్న చెరువులు, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ పరిధిలోని రోడ్లు, వంతెనలు, కల్వర్టులు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు తదితర వివరాలు, వాటి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు, వరదలు కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత తెగిపోయిన చెరువులు, రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టుల తాత్కాలిక పునరుద్ధరణ పనులు, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన మరమ్మతులు వెంటనే చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు.
శాశ్వత ప్రాతిపదికన పను లు చేపట్టడానికి కావల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. వర్షాలు ప్రస్తుతానికి కొంత శాంతించినా మళ్లీ వస్తే స్థానిక ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఆయా మండలాలకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు ఎంపీటీసీలు, సర్పంచులు, టీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.