కమ్మర్పల్లి, ఆగస్టు 3 : ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డిపై హత్యకుట్ర హేయమైన చర్య అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. హత్యకుట్రను ఆయన తీవ్రంగా ఖండించారు. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండే జీవన్రెడ్డి లాంటి నాయకుడిపై హత్యాయత్నం చేయడం దారుణమని మండిపడ్డారు. బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే జీవన్రెడ్డి నివాసానికి బుధవారం వెళ్లి పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలతోపాటు ఆయన క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని జీవన్రెడ్డికి సూచించారు.
హైదరాబాద్కు తరలిన ఆర్మూర్ నాయకులు..
ఆర్మూర్, ఆగస్టు 3 : ఎమ్మెల్యే జీవన్రెడ్డిపై కల్లడి గ్రామ సర్పంచ్ భర్త హత్యాయత్నం చేసినట్లు సోషల్ మీడియా, టీవీలు, పత్రికల ద్వారా తెలుసుకున్న ఆర్మూర్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆందోళన చెందారు. హుటాహుటిన హైదరాబాద్లోని జీవన్రెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో రాజారాం యాదవ్, కోటపాటి నర్సింహనాయుడు, కల్లెం మోహన్రెడ్డి, మార్కంటి మల్లేశ్, పండిత్ ప్రేమ్, పండిత్ పవన్, ఖాందేశ్ శ్రీనివాస్, ఆలూర్ శ్రీనివాస్రెడ్డి, మచ్చర్ల సాగర్, సత్యనారాయణ, జీజీరామ్, కుస్తాపురం గంగారెడ్డి, రిక్కల రాజారెడ్డి, నడ్కుడ శ్రీనివాస్రెడ్డి, జన్నేపల్లి గంగాధర్ తదితరులు ఉన్నారు.
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
డిచ్పల్లి, ఆగస్టు 3 : ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ -డిచ్పల్లి ఆధ్వర్యంలో వివిధ కోర్సుల్లో శిక్షణ అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ కృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ (30 రోజులు), సీసీటీవీ ఇన్స్టాలేషన్ (13 రోజులు), సెల్ఫోన్ రిపేరింగ్ (30 రోజులు), బైక్ మెకానిక్ (30 రోజులు) కోర్సుల్లో ఉచిత శిక్షణ, భోజన సదుపాయంతో పాటు హాస్టల్ వసతి కల్పిస్తామని తెలిపారు. 19 నుంచి 35 ఏండ్ల వయస్సు ఉన్న వారు అర్హులని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ ఆధార్, రేషన్ కార్డు, ఎస్సెస్సీ మెమో, ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు వెంట తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 08461-222428, 08461-295428 నంబర్లను సంప్రదించాలని సూచించారు.