నిజామాబాద్ క్రైం,జనవరి 28: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాల పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ అరవింద్ బాబు పర్యవేక్షణలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు వెంకటేశ్వర్,ప్రభాకర్ రావు,కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు విధులు నిర్వర్తించాయి.
హెలీప్యాడ్ పరిసర ప్రాంతాలను బాండ్ స్కాడ్, డాగ్ స్కాడ్ బృందాలు ముమ్మరంగా తనిఖీ చేశాయి. హెలీప్యాడ్ వద్దకు ముఖ్యమైన ప్రజాప్రతినిధులను తప్ప ఇతరులను అనుమతించలేదు. వారిని సైతం మెటల్ డిటెక్టర్తో తనిఖీ చేసిన అనంతరమే అనుమతించారు. స్పెషల్ పార్టీ బలగాలు,రోప్ పార్టీ సిబ్బంది హెలీప్యాడ్ వద్ద కట్టుదిట్టమైన భద్రత నిర్వహించారు.
మినీ బస్సును తనిఖీ చేసిన ఆర్టీఏ అధికారులు
నగరంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గ్గొనేందుకు మంత్రి కేటీఆర్ ప్రయాణం చేసే మినీ వజ్రా బస్సును రవాణా శాఖ అధికారులు క్షుణంగా పరిశీలించారు. ఆర్టీఏ అధికారులు స్వయంగా బస్సును నడిపి కండీషన్ను పరిశీలించారు. బాంబ్, డాగ్ స్కాడ్ బృందాలు మినీ బస్సు ను తనిఖీ చేశాయి.
ట్రాఫిక్ మళ్లింపు..
ఖలీల్వాడిలో ఓ ప్రైవేటు దవాఖానను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, సీఐ చందర్ రాథోడ్ ఆధ్వర్యంలో ఖలీల్వాడి ఏరియాలో వాహనదారులు, జనాలకు ఎలాంటి ఇబ్బందుకు కలుగకుండా ట్రాఫిక్ను మళ్లించారు. మంత్రి కేటీఆర్ కాన్వాయి వెళ్లే ప్రధానదారుల్లో సివిల్, స్పెషల్ పార్టీ బలగాలు కట్టుదిట్టమైన భద్రత నిర్వహించాయి. నూతన కలెక్టరేట్ నుంచి కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు, కంఠేశ్వర్ చౌరస్తా, రైల్వే కమాన్ చౌరస్తా, ధర్నా చౌక్, కోర్టు చౌరస్తా, ఎల్లమ్మగుట్ట చౌరస్తా, పూలాంగ్ చౌరస్తా, వినాయక్నగర్, బోర్గాం(పీ) ప్రధాన ఏరియాలో పోలీస్ పికెట్లతోపాటు మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.