నిజామాబాద్, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నేడు ఇందూరులో పర్యటించనున్నారు. ఐటీ టవర్, న్యాక్ బిల్డింగ్, మున్సిపల్ భవనం, ట్యాంక్బండ్, అధునాతన వైకుంఠధామాలను మంత్రి ప్రారంభిస్తారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కేటీఆర్ రాక సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు, అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. నగరంలోని వీధులన్నీ స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలతో గులాబీమయంగా మారాయి. హెలీక్యాప్టర్ ద్వారా ఉదయం 11.15 గంటలకు నిజామాబాద్ చేరుకునే మంత్రి సాయంత్రం 4గంటల వరకు జిల్లా కేంద్రంలో బిజీబిజీగా గడపనున్నారు. మంత్రికి ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నేడు నిజామాబాద్ పర్యటనకు రానున్నారు. కేటీఆర్ రాక సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లా కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఐటీ టవర్, న్యాక్ బిల్డింగ్, మున్సిపల్ కొత్త భవనం, ట్యాంక్బండ్, అధునాతన వైకుంఠధామాలకు కేటీఆర్ ప్రారంభోత్సవాలు చేస్తారు. కేటీఆర్ రాక సందర్భంగా నగర వ్యాప్తంగా భారీ ఏర్పాట్లు చేస్తుండగా బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. బైపాస్ రోడ్డులో కొత్త కలెక్టరేట్ను ఆనుకొని నిర్మించిన ఐటీ టవర్, ఆ పక్కనే నెలకొన్న న్యాక్ బిల్డింగ్లను ప్రారంభిస్తుండడంతో కలెక్టరేట్ తోవ సరికొత్తగా రూపుదిద్దుకున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో బైపాస్ మార్గంలోని జీజీ కాలేజీ ప్రాంతమంతా ప్రభుత్వ భవంతులతో సరికొత్త శోభను సంతరించుకున్నది. ఏక కాలంలో యువతకు ఉపయోగపడే ఐటీ టవర్, న్యాక్ బిల్డింగ్ ప్రారంభిస్తుండడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామన్నకు ఘనంగా స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సైతం సిద్ధమయ్యారు. బహిరంగ సభ ద్వారా తెలంగాణ సర్కారు చేసిన అభివృద్ధిని కేటీఆర్ వివరించనున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్, సీపీ
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం జిల్లా కేంద్రంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, సీపీ ప్రవీణ్కుమార్తో కలిసి ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. ఐటీ టవర్, న్యాక్ బిల్డింగ్, దుబ్బ, వర్ని రోడ్డు, ఆర్సపల్లి ప్రాంతాల్లో నిర్మించిన వైకుంఠధామాలు, నగరపాలక సంస్థ నూతన భవనం, మినీ ట్యాంక్బండ్ను సందర్శించారు. మున్సిపల్ కార్మికులతో కలిసి మంత్రి కేటీఆర్ సహపంక్తి భోజనం చేయనున్న శ్రీరామ గార్డెన్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా మంత్రి కేటీఆర్ పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రతాపరంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. వీరి వెంట నగర మేయర్ దండు నీతూకిరణ్, కమిషనర్ ఎం.మకరంద్, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, అదనపు డీసీపీ జయరాం, ఏసీపీ కిరణ్కుమార్, ఆర్అండ్బీ ఎస్ఈ రాజేశ్వర్రెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మురళీమనోహర్రెడ్డి, నగర పాలక సంస్థ ఇంజినీర్ రషీద్, ట్రాన్స్కో ఏడీఏ రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
రూ.50కోట్లతో ఐటీ టవర్…
నిజామాబాద్ ఐటీ టవర్ రూ.50కోట్ల నిధులతో నిర్మించారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఐటీ టవర్ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రభుత్వపరంగా టీఎస్ఐఐసీ ద్వారా మౌలిక వసతులు, అత్యాధునిక సౌకర్యాలను కల్పించింది. ఐటీ సంస్థలను నెలకొల్పబోయే వారంతా ఐటీ శాఖతో ఒప్పందాలను కుదుర్చుకున్నది. ఐటీ కంపెనీల్లో ఉద్యోగ నియామక ప్రక్రియను టాస్క్ ఆధ్వర్యంలో జూలై 21న నిర్వహించింది. వేలాది మంది తరలిరాగా అందులో నైపుణ్యం కలిగిన వారిని ఐటీ కంపెనీలు రిక్రూట్ చేసుకుంటున్నాయి. మొత్తం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాన్ని ఆకట్టుకునే రీతిలో చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్తో కలుపుకొని మూడు అంతస్థులతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఎకరం భూమిలో ఐటీ టవర్ను డిజైన్ చేశారు. మిగిలిన 2.5 ఎకరాల భూమిని భవిష్యత్తులో ఐటీ టవర్ను విస్తరించాలనుకున్న సమయంలో ఎలాంటి స్థలాల కొరత లేకుండా ఉండేందుకు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు.
మోడ్రన్ వైకుంఠధామాలు..
నిజామాబాద్ నగరంలో నలుదిక్కు లా నాలుగు ఆధునిక వైకుంఠధామాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఫాంహౌస్లను తలపించేలా నిర్మితమైన శ్మశానవాటికలంటే నమ్మశక్యంగా లేదంటే అతిశయోక్తి కాదు. పేద, ధనిక తేడా లేకుండా మనిషి జీవితంలో ఎదురయ్యే చివరి కార్యక్రమాలను గౌరవప్రదంగా నిర్వహించుకునేందుకు రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నది. శ్మశానవాటికలను వైకుంఠధామాల పేరుతో పునర్నిర్మిస్తూ ప్రజలకు ఎంతో సౌకర్యవంతమైన సేవలను అందిస్తున్నది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ప్రత్యేక చొరవతో అత్యాధునిక శ్మశాన వాటికలు రాష్ట్రంలోనే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఓవైపు పచ్చదనం, మరోవైపు ఆధ్యాత్మికత, ఇంకోవైపు మౌలిక సదుపాయాలు వేటిలోనూ కొరత లేకుండా తీర్చిదిద్దిన మోడ్రన్ వైకుంఠధామాలు చూసేందుకు విస్మయానికి గురి చేస్తున్నాయి. నలుదిక్కులా నాలుగింటికి శ్రీకారం చుట్టగా మూడు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. రూ.20కోట్లతో వీటి నిర్మాణాన్ని చేపడుతున్నారు. దుబ్బలో రూ.8.4కోట్లు, వర్ని రోడ్డులో రూ.2.4 6కోట్లు, అర్సపల్లిలో రూ.4.8 కోట్లు వె చ్చించారు. ప్రగతినగర్లో కొత్తది నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.4.5కోట్లు కేటాయించారు.
నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా న్యాక్..
నగరంలోని సమీకృత కలెక్టరేట్ భవనం, ఐటీ టవర్కు ఆనుకొని నిర్మితమైన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సెంటర్కు జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా నామకరణం చేశారు. ఇందుకోసం రూ.6.15కోట్లు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఏసీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో ఉండగా, జగిత్యాల జిల్లాలోనూ ఎన్ఏసీ కేంద్రం ఉన్నది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనూ ఈ ప్రాంత యువతీ, యువకుల మేలు కోసం ఎన్ఏసీని నెలకొల్పారు. ఇందులో అధునాతన సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఐదు స్మార్ట్ క్లాస్ గదులు, మూడు ప్రయోగశాలలు, 1 కంప్యూటర్ ల్యాబ్, 120 మంది అభ్యర్థులకు వసతి, భోజన సౌకర్యానికి వీలుగా వసతి గృహం, 1 కౌన్సిలింగ్ గది, 1 ప్లేస్మెంట్ రూమ్, 8 కార్యాలయ గదులను నిర్మించారు. చదువుతో సంబంధం లేకుండా స్వయం ఉపాధిపై ఆసక్తి ఉన్న వారందరికీ ఎన్ఏసీ చుక్కానిగా నిలువనుంది. మేసన్ జనరల్, అసిస్టెంట్ బార్ బెండర్ అండ్ స్టీల్ ఫిక్చర్, షట్టరింగ్ కార్పెంటరీ, కన్స్ట్రక్షన్ పెయింటర్ అండ్ డెకొరేటర్, అసిస్టెంట్ టెక్నీషియన్ డ్రై వాల్ అండ్ ఫాల్స్ – సీలింగ్, అసిస్టెంట్ ఎలక్ట్రిషన్, ప్లంబర్(జనరల్), అసిస్టెంట్ సర్వేయర్, అసిస్టెంట్ వర్క్ సూపర్వైజర్, ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డర్, అసిస్టెంట్ స్టోర్ కీపర్ అండ్ స్టోర్ కీపర్, సూపర్వైజర్ స్ట్రక్చర్, టైలరింగ్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. భవన నిర్మాణాన్ని జీ ప్లస్ 2 పద్ధతిలో నిర్మించారు. ప్రతి ఫ్లోర్ 12,519 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా మొత్తం 37,557 చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చింది.
అద్భుతంగా మినీ ట్యాంక్బండ్…
నగర వాసుల సౌకర్యార్థం అనేక పార్కులను ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అభివృద్ధి చేశారు. కబ్జా కోరల్లో చిక్కుకున్న వాటిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే సర్వే చేపట్టి ఖాళీ జాగాలను గుర్తించారు. వాటికి కంచె వేసి రక్షించారు. అనంతరం సీఎం కేసీఆర్ పిలుపుతో నగరపాలక సంస్థ పరిధిలో ఖాళీ స్థలాల్లో పట్టణ ప్రకృతి వనాలను నెలకొల్పారు. గతేడాది కేసీఆర్ ఆదేశాలతో మరికొన్ని జాగాల్లో క్రీడా ప్రాంగణాలను తీర్చిదిద్దారు. ఇదిలా ఉండగా చారిత్రక రఘునాథ చెరువును రూ.14కోట్ల నిధులతో అభివృద్ధి చేశారు. రోజురోజుకూ విస్తరిస్తున్న నిజామాబాద్ నగరానికి చెప్పుకోదగ్గ విడిది కేంద్రం లేకపోవడంతో దీనిని అద్భుతంగా తీర్చిదిద్దారు. రఘునాథ చెరువు కట్టను పటిష్టపర్చడంతోపాటు పచ్చదనంతో నింపారు. చెరువును శుభ్రం చేయించారు. ఆహ్లాదకరంగా పిల్లలకు ఆట విడుపునకు సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. చిన్నా, పెద్ద అంతా కలిసి సేదతీరేలా ట్యాంక్బండ్ను తీర్చిదిద్దారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ పాత మున్సిపల్ భవనం పెచ్చులూడి దీనస్థితికి చేరుకున్నది. రూ.7కోట్ల నిధులను పురపాలక మంత్రి కేటీఆర్ మంజూరు చేయడంతో వైట్హౌస్ను తలపించేలా నూతన భవనాన్ని పాత బిల్డింగ్కు సమీపంలోనే నిర్మించారు. ఆధునిక వసతులను ఇందులో ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాలకు చక్కని వేదికను తీర్చిదిద్దారు.
మంత్రి రామన్న పర్యటన ఇలా..