నిజామాబాద్, మే 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహారాష్ట్రలో రైతులంతా తెలంగాణ లెక్క స్కీములు కావాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీలో వందలాది మంది నిత్యం చేరుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు చెప్పారు. రైతులు పోరాటం చేస్తే తెలంగాణ తరహా పథకాల అమలుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని వేసిందని గుర్తుచేశారు. ఎట్లా చేస్తే తెలంగాణ పథకాలు అమలుకు ఆస్కారం ఉంటదో పరిశీలన చేయాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకోవడం కేసీఆర్ పరిపాలనకు దక్కిన గౌరవమేనని అన్నారు. కేసీఆర్ పనితీరు బాగుందనే.. దేశం మొత్తం మనవైపు చూస్తున్నదని చెప్పారు. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ ప్రస్తుతం 3వ స్థానంలో ఉందని, త్వరలోనే మొదటి స్థానానికి చేరుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావు ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో హాజరై గులాబీ శ్రేణులను ఉత్తేజపరిచారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లి కలాన్ గ్రామంలో పోచారం ప్రధాన కాలువపై రూ.50లక్షలతో నిర్మిస్తున్న సింగిల్ లేన్ వంతెన, ఎల్లారెడ్డి పట్టణంలో 100 పడకల దవాఖాన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే సురేందర్, ఎంపీ బీబీపాటిల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, కలెక్టర్ జితేశ్ పాటిల్తో కలిసి శంకుస్థాపన చేశారు. గండిమాసానిపేటలో బస్తీ దవాఖానను ప్రారంభించారు. అనంతరం లింగంపేటలో ఆత్మీయ సమ్మేళనానికి హాజరై ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్లో కరెంట్ తీగలు లేక డీజిల్ ఇంజిన్లు, ఆయిల్ ఇంజిన్లు పెట్టుకొని రైతులు తమ పొలంలో నీరు పారించుకునేందుకు మోటార్లు నడుపుకొంటున్నారన్నారు. తెలంగాణలో ఎక్కడైనా ఈ పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. వారిది డబుల్ ఇంజిన్ సర్కారు కాదు. ఆయిల్ ఇంజిన్ మీద వ్యవసాయం చేసే పరిస్థితి ఉన్నదని ఎద్దేవా చేశారు. యూపీ, మహారాష్ట్రలో 8గంటలే కరెంట్ సరఫరా ఉందని, పొద్దున 3 గంటలు, దొంగ రాత్రి 5 గంటలు ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణలో 24గంటలు కరెంట్ వస్తున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మైగ్రేషన్ అయితే… బీఆర్ఎస్ పాలన ఇరిగేషన్ అంటూ అభివర్ణించారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరు బిడ్డల వలసలు, నిజామాబాద్, కామారెడ్డి బిడ్డలు బొంబాయి, దుబాయ్ వలసలు పోయారని చెప్పారు.
ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్తలకు మంత్రి హరీశ్ రావు హితబోధ చేశారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న సత్యదూరమైన ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపోళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారన్నారు. వారిపై బీఆర్ఎస్ కార్యకర్తలంతా విషయంతో తిప్పికొట్టాలని స్పష్టం చేశారు. మనం ఇంత బలంగా ఉంటే కాంగ్రెసోడు నేను గెలుస్తా అంటుండు. యాభై సీట్లలో అభ్యర్థులు లేని కాంగ్రెస్ పార్టీ. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుండడం హాస్యాస్పదంగా మారిందని చెప్పారు. అంబేద్కర్ చెప్పినట్లు…నిజాన్ని చెప్పకపోతే, ప్రచారంలో నిలపెట్టకపోతే అబద్ధం రాజ్యమేలుతుందన్నారు. నిజం చెప్పకపోతే ఈ కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలను ప్రజలు నమ్మే ప్రమాదం ఉందన్నారు. ఇన్నేళ్లలో ఎవ్వరూ చేయని పనిని మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కారు అంటూ చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పక్కనున్న మహారాష్ట్రలో 8 రోజులకు ఒక్కసారి నల్లా వస్తుందని ఎద్దేవా చేశారు. పుణె, నాందేడ్, ఔరంగబాద్, నాగ్పూర్లో తాగు నీళ్లు ఇచ్చేందుకు తండ్లాడుతున్నారని తెలిపారు. నీళ్లిచ్చేందుకు చేతకాని ప్రభుత్వమే ఈ డబుల్ ఇంజిన్ సర్కారు అంటూ పేర్కొన్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గం ఆది నుంచి ఉద్యమకారుల అడ్డా అని మంతి హరీశ్ రావు ప్రశంసించారు. ఈ ప్రాంతంపై సీఎంకు ప్రత్యేకమైన అభిమానం ఉందని చెప్పారు. త్వరలోనే ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వస్తారని హరీశ్ రావు ప్రకటించారు. సీఎం పర్యటనలో ఎల్లారెడ్డికి వరాల మూట అందడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పాకులాడుతున్నదన్నారు. తెలంగాణలో పది శాతం సీట్లు వస్తే చాలనుకున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. దేశ రాజకీయాల్లో అడుగు పెట్టిన కేసీఆర్ బలపడితే తెలంగాణకు మంచిగైతదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి బంద్ చేస్తామంటూ, ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటూ చేసిన ప్రకనటపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెసోడికి అవకాశమిస్తే ఏమైతదో అందరికీ తెలిసిందేనంటూ విమర్శలు గుప్పించారు. ధరణి తీసేస్తే పైరవీకారులు పుట్టుకొస్తరు. వీఆర్వోలు వస్తారు. లంచాలు, పైరవీలు పెరుగుతాయి. పాస్బుక్కు లంచం, రిజిస్ట్రేషన్కు లంచం, ప్రతిదానికి లంచాలే వస్తదంటూ వివరించారు. ఇప్పుడు ధరణిలో పొద్దున పోతే అరగంటలో రిజిస్ట్రేషన్ పూర్తవుతున్నదన్నారు. కాంగ్రెస్ పాలన అంటే దొంగ రాత్రి కరెంటు. 2వేల పింఛన్ బంద్ అయ్యి 200 రూపాయలు ఇస్తరు. కాంగ్రెస్ పాలన అంటే కల్యాణలక్ష్మి బంద్ అవుతది. కాంగ్రెస్ పాలన అంటే ఎరువుల కోసం లాఠీ దెబ్బలు తినాలి. చెప్పులు వరుసలో నిలబడాలే. కాంగ్రెస్ పాలన అంటే తాగడానికి నీళ్లు ఉండవు. రైతుబంధు ఉండది. గిసుంటే బాధలు ఎవడికి గావాలే అంటూ ప్రజలను అడిగారు. ప్రజలంతా ఆలోచన చేయాలన్నారు.
లింగంపేట, మే 28: గల్లీ నుంచి ఢిల్లీ వరకు అధికారంలో ఉన్న సమయంలో అభివృద్ధి చేయని నాయకులు, నేడు ఎలా చేస్తారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. లింగంపేటలో ఆదివారం నిర్వహించిన ఆత్మీ య సమ్మేళనంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో ఉన్న సమయంలో అభివృద్ధిని విస్మరించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. దేశంలోని ఏరాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నట్లు తెలిపారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. నీతి ఆయోగ్లో తెలంగాణ రాష్ర్టానికి అత్యధికంగా అవార్డులు వచ్చాయని వివరించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ సమయాన్ని వృధా చేయకుండా అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని గుర్తుచేశారు.
ఎల్లారెడ్డి/లింగంపేట, మే 28 : సీఎం కేసీఆర్ హయాంలో ఆరోగ్య తెలంగాణ ఆవిష్కృతమైందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డి ప్రజలపై ఉన్న ప్రేమతోనే వంద పడకల వైద్యశాల ను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని, మంత్రి హరీశ్రావు వెంటనే నిధులు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎల్లారెడ్డి ప్రాంత ప్రజలు ముందుండి పోరాటం చేయడంతోనే ఈ రోజు అభివృద్ధి జరుగుతున్నదని అన్నారు. వీలైనంత త్వరగా వైద్యశాల నిర్మాణం పనులు పూర్తవుతాయని, అప్పుడు ప్రతి ఒక్కరికీ ఉచితంగా వైద్యం అందుతుందని తెలిపారు.
రాష్ర్టాభివృద్ధి జరుగుతున్న తరుణంలో ప్రతిపక్షాలు అబద్దాలతో బద్నాం చేస్తున్నారని, వాటిని బీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని ఎమ్మెల్యే జాజాల సురేందర్ పిలుపునిచ్చారు. లింగంపేట ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు అబద్దాలతో ప్రచారం చేస్తున్నారని అన్నారు. కార్యకర్తలు ఐదు నెలల పాటు కష్టపడితే ఐదేండ్లు సేవ చేస్తానని వెల్లడించారు.
ఉర్దూ అకాడమీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజిబొద్దీన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనతో నిధులు, నీళ్లు, నియమకాలు సాధ్యమవుతాయని నాడు జలదృశ్యం నుంచి కేసీఆర్ పిలుపుతో ఉద్యమం చేసి రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్రం సాధించిన తర్వాత కూడా కార్యకర్తల కృషి మరువలేనిది అని అన్నారు. కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం అన్నారు.
కామారెడ్డిలో నెలకొల్పిన మెడికల్ కాలేజీ ఈ సంవత్సరం ప్రారంభమవుతుందని వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఇప్పుడు వైద్యం కోసం హైదరాబాద్కు పోవాల్సిన అవసరం ఉండదన్నారు. కామారెడ్డిలోనే సూపర్ స్పెషాలిటీ సేవలతో మెడికల్ కాలేజీ ప్రారంభం కాబోతున్నట్లు చెప్పారు. తెలంగాణలో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్తో పేద గిరిజన విద్యార్థులకు వైద్య విద్య నేర్చుకునే అవకాశం దొరికిందని, బీ కేటగిరి సీట్లో లోకల్ రిజర్వేషన్ 80శాతం ఇవ్వడంతో స్థానిక విద్యార్థులకు వైద్య విద్య చదువుకునే అవకాశం లభించిందని చెప్పారు. ఎల్లారెడ్డి పట్టణంలో 100 పడకల దవాఖానకు భూమి పూజ చేసిన అనంతరం వైద్య సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి నియోజకవర్గంలో వంద పడకల దవాఖానను తీసుకొస్తున్నామని అన్నారు. ఎల్లారెడ్డిలోనూ వంద పడకల దవాఖాన మంజూరు చేసి శంకుస్థాపన చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. దేశంలో తెలంగాణ వైద్య ఆరోగ్య రంగంలో మూడోస్థానంలో ఉన్నదని, మొదటి స్థానంలో ఉంచేందుకు అందరం కృషి చేస్తున్నామన్నారు. గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్క డయాలసిస్ కేంద్రం కూడా ఉండేది కాదని, ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా పేషెంట్లకు ఉచిత బస్సు పాస్, పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు.