అదే జోష్.. అదే హోష్.. ఊరూరా గులాబీ జెండా రెపరెపలాడింది. బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుక కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రతినిధుల సభలు ఉత్సాహంగా సాగాయి. ఎమ్మెల్యేల సారథ్యంలో నిర్వహించిన ఈ సమావేశాలు ఆత్మీయత, అనురాగాలకు వేదికయ్యాయి. సభ ప్రారంభం నుంచి ముగిసే వరకూ జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై భారత్ నినాదాలు మిన్నంటాయి.బాన్సువాడలో జరిగిన సభకు స్థానిక ఎమ్మెల్యే హోదాలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. రైతుకు గత ప్రభుత్వాల్లో ఎదురైన దుస్థితిని, ఇప్పుడు అందుతోన్న సాయాన్ని సోదాహరణలతో సహా వివరించారు. కమ్మర్పల్లిలో నిర్వహించిన బాల్కొండ ప్రతినిధుల సభలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఆర్మూర్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే జీవన్రెడ్డి, రూరల్లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్లో ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ఆధ్వర్యంలో జరిగిన ప్రతినిధుల సభలకు కార్యకర్తలు వేలాదిగా హాజరయ్యారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు.
నిజామాబాద్, ఏప్రిల్ 25, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలు నియోజకవర్గ స్థాయిలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యేల సారథ్యంలో నిర్వహించిన సభలకు పార్టీ శ్రేణులు పోటెత్తారు. అధిష్టానం ఆదేశాలతో స్థానిక ఎమ్మెల్యేలు అట్టహాసంగా నిర్వహించారు. ప్లీనరీ వేడుక గులాబీ పండుగను తలపించింది. సభను నిర్వహించిన ప్రాంతమంతా గులాబీమయమైంది. గులాబీ జెండాలతో, కేసీఆర్ చిత్ర పటాలతో కార్యకర్తలు జోరుగా పాల్గొన్నారు. జై కేసీఆర్… జై భారత్… అన్న నినాదాలతో సభా ప్రాంగణాలు హోరెత్తాయి. ఆయా సభల్లో స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు ముఖ్య నాయకులంతా వేదికను పంచుకోవడంతో నిండుదనం కనిపించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ప్రతినిధుల సభల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై లోతైన చర్చ జరిగింది. తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనపై స్థానిక ఎమ్మెల్యేలు పూస గుచ్చినట్లు వివరించి చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు గులాబీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై, కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలపైనా తీర్మానాలను ఆమోదించారు.
నియోజకవర్గ ప్లీనరీ సభల్లో ఆరు తీర్మానాలకు పైగా ఆమోదం తెలిపారు. రాష్ట్ర సర్కారు అమలు చేసిన పథకాలపై వందలాది తీర్మానాలు ఆమోదించవచ్చన్న సంకేతాలను శ్రేణులు అందించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు ముఖ్యమైన రంగాల్లో సాధించిన ప్రగతిపై ఎమ్మెల్యేల సమక్షంలో తీర్మానాలు చేశారు. ఇందులో ప్రజా సంక్షేమం, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, విద్యా, ఉపాధి, వ్యవసాయ రంగం, నీటిపారుదలతో పాటు బీజేపీ వైఫల్యాలు ఉన్నా యి. తీర్మానాల్లో వ్యవసాయ రంగంలో రాష్ట్రం సాధించిన గణనీయమైన వృద్ధిపై ప్రతి ఒక్కరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రైతుబంధు, రైతుబీమా, సాగు నీరు, ఉచిత కరెంట్, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా వంటి కార్యక్రమాల అమలుపై చర్చ జరిగింది. రైతుకు వెన్నముకగా కేసీఆర్ ఎలా నిలిచారో ఎమ్మెల్యేలు తమ ప్రసంగాల్లో వివరించారు. బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వయంగా తాను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు సాధించిన విప్లవాత్మకమైన మార్పును వివరించారు. రైతుకు గత ప్రభుత్వాల్లో ఎదురైన దుస్థితిని ఇప్పుడు అందుతున్న సాయాన్ని బేరీజు వేస్తూ వివరించే ప్రయత్నం చేశారు. రైతుకు దేవుడిలా కేసీఆర్ మారారని చెప్పారు. అలాంటి కేసీఆర్ను దేశ రాజకీయాల్లోనూ రాణించే విధంగా తెలంగాణ ప్రజలంతా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. బోధన్ మినహా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రతినిధుల సభలో ఏకగ్రీవంగా అనేక తీర్మానాలు ఆమోదమయ్యాయి.
ఆద్యాంతం ప్లీనరీ సభలు ఉల్లాసంగా… ఉత్సాహంగా సాగాయి. దాదాపు ప్రతి నియోజకవర్గంలోని ప్రతినిధుల సభలో 3వేల మంది వరకు కార్యకర్తలు హాజరయ్యారు. సభకు వచ్చిన వారందరికీ కడుపు నిండా భోజనం పెట్టించారు. హైదరాబాద్లో ప్లీనరీ వేడుకను తలపించే విధంగా రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో పాల్గొన్నంత ఉత్సాహాన్ని నింపేలా సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. సభలో చర్చించిన ప్రతి అంశాన్ని ప్రజల్లో వివరించే ప్రయత్నం చేయాలని ముగింపు ప్రసంగంలో ఎమ్మెల్యేలంతా శ్రేణులకు హితబోధ చేశారు. బీజేపీ చేస్తున్న విషప్రచారాన్ని, సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్న కల్పితాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం బీఆర్ఎస్ కార్యకర్తల బాధ్యతగా వివరించారు.