ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలను కల్పిస్తున్నది. పేదలకు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు సత్ఫలితాలనిస్తున్నాయి. పేదల సుస్తీని తగ్గించే దోస్తీ దవాఖానలుగా మారాయి. ప్రతి రోజూ సుమారు 50-100 మంది దవాఖానల్లో వైద్యం చేయించుకునేలా ఏర్పాట్లు చేసింది. వైద్య సేవలు అందించడంతో పాటు రోగ నిర్ధారణ పరీక్షలు, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు పేదల పాలిట వరంలా మారాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చొరవతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు.. ప్రైవేటుకు దీటుగా సేవలందిస్తున్నాయి. దీంతో పేదలకు వైద్య ఖర్చులు తప్పుతున్నాయి.
-బాన్సువాడ టౌన్, నవంబర్ 28
ప్రైవేటుకు దీటుగా సర్కారు వైద్యం
బాన్సువాడ టౌన్, నవంబర్ 27: రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం నిబద్ధతతో కృషి చేస్తున్న ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నది. ఈ క్రమంలోనే ప్రభుత్వ దవాఖానలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దడమే కాకుండా అందరికీ అందుబాటులో ఉండేలా పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. ప్రజలు రోగాల బారినపడకుండా కాపాడడంలో, ఒకవేళ రోగాలబారిన పడినా.. ఆ రోగాలను ప్రాథమిక స్థితిలోనే గుర్తించి వాటిని అరికట్టడంలో బస్తీ దవాఖానలు తోడ్పడుతున్నాయి. పేదలకు ఆర్థికంగా, దూరం పరంగా ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారిని బస్తీ, పల్లె దవాఖానలు ఆదుకుంటున్నాయి.
ఆరోగ్యంపై పేదలకు సరైన అవగాహన కల్పించి రోగాలబారినుంచి రక్షణ పొందడంలో తోడ్పడుతున్నాయి.రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆలోచనల్లోంచి పుట్టినదే బస్తీ దవాఖాన. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బస్తీ దవాఖానలను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కేంద్రంలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడంతో పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నది.
రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానల్లో ప్రైవేటుకు దీటుగా వైద్య సేవలు అందుతున్నాయి. ఉదయం 9 నుంచి సాయం త్రం 4 గంటల వరకు ఈ దవాఖానల్లో వైద్యులు సేవలందిస్తున్నారు. ఓపీ, ప్రాథమిక రోగ నిర్ధారణ పరీక్షలు, గర్భిణులు, బాలింతలకు పరీక్షలు, టీకాలు వేయడం, కుటుంబ నియంత్రణ కౌన్సెలింగ్, రక్తహీనత, షుగర్, బీపీ పరీక్షలను, ఇతరత్రా ప్రాథమిక చికిత్సలు, ఆరోగ్య పరిరక్షణ, అవగాహన, చైతన్యం వంటి అనేక సేవలను అందిస్తున్నారు. గర్భిణులకు క్యాల్షియం, ఐరన్ మాత్రలను పంపిణీ చేస్తున్నారు. థైరాయిడ్, సుఖ ప్రసవం గురించి వైద్యులు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. .
ఒక డాక్టర్, నలుగురు సిబ్బందితో..
ఒక్కో బస్తీ దవాఖానలో ఒక డ్యూటీ డాక్టర్, స్టాఫ్ నర్సు, నర్సింగ్ సిబ్బంది, అటెండర్లను నియమించారు. వారంలో రెండు రోజులు బుధవారం, శనివారం చిన్న పిల్లలు, బాలింతలకు సంబంధించిన టీకాలను వేస్తారు. బాన్సువాడ మినీ స్టేడియంలో ప్రారంభమైన ఈ బస్తీ దవాఖాన.. ప్రైవేటుకు దీటుగా వైద్య సేవలందిస్తున్నదని ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. త్వరలోనే ల్యాబ్ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ దవాఖానలో రోజుకు సుమారు 50 నుంచి 65 మంది రోగులు చికిత్స నిమిత్తం వస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు
రూ.28 లక్షలు మంజూరు..
బాన్సువాడ పట్టణ పరిధిలో రెండు బస్తీ దవాఖానల ఏర్పాటుకు రూ.28లక్షలను ప్రభుత్వం కేటాయించింది. అందులో ఒకదానిని తాత్కాలికంగా బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ మినీస్టేడియంలో ఏర్పాటు చేయగా దసరా రోజు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ దవాఖాన నూతన, శాశ్వత భవనాల నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని స్పీకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పాత బాన్సువాడ చావిడి వద్ద నూతన, శాశ్వత భవనంలోమరో బస్తీ దవాఖాన ఏర్పాటు కోసం పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. అతి త్వరలో ఈ దవాఖాన కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం.
ప్రజల సుస్తి పోగొట్టేందుకే..
బస్తీ ప్రజల సుస్తి పోగొట్టేందుకే ఈ బస్తీ దవాఖానను ఏర్పాటు చేశాం. బాన్సువాడలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని రెండు దవాఖానలను కేటాయించాల్సిందిగా సీఎం కేసీఆర్ను కోరాను. అడగ్గానే కేటాయించి వాటి ఏర్పాటుకు నిధులు మంజూరు చేసిన సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు
– పోచారం శ్రీనివాసరెడ్డి, స్పీకర్
స్పీకర్కు కృతజ్ఞతలు..
బాన్సువాడ పట్టణంలోని ఏరియా దవాఖానకు మా కాలనీకి మధ్య సుమారు 3కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రజలు ఏరియా దవాఖానకు వెళ్లేందుకు ఇబ్బందులు పడేవారు. మా వార్డులో బస్తీ దవాఖాన ఏర్పాటు చేయడంతో ప్రజలందరూ ఇక్కడే వైద్య సేవలు పొందుతున్నారు. దవాఖాన ఏర్పాటుకు కృషి చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు.
– నేహాసుల్తానా హకీం, కౌన్సిలర్
చాలా సంతోషంగా ఉంది..
మేము రాజారాం దుబ్బా ఏరియాలో ఉంటాం. జ్వరం లాంటి చిన్నచిన్న సమస్యలకు ఏరియా దవాఖానకు వెళ్లే అవసరం లేకుండా బస్తీ దవాఖానను ఏర్పాటు చేశారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా బస్తీ దవాఖానలోనే మందులు ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నది.
– షేక్ సలాం, పట్టణవాసి
ప్రైవేటుకు బంద్ అయినం…
బస్తీ దవాఖాన మా ఇంటికి 5 నిమిషాల నడక దూరంలో ఉంది. ఇప్పుడు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కాలనీలోని ప్రైవేటు క్లినిక్కు వెళ్లడం లేదు. బస్తీ దవాఖానకు వెళ్తున్నాం. ఇక్కడ డాక్టర్లు బాగా చూస్తున్నారు.
– అబిదా బేగం, కాలనీవాసి