శక్కర్నగర్, ఆగస్టు 3 : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆరోగ్య మహిళ’ పథకం సత్ఫలితాలనిస్తున్నది. ఇందులో భాగంగా 30 ఏండ్ల వయస్సు పైబడిన ప్రతి మహిళకూ వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, వ్యాధులను నిర్ధ్దారించి, మందులను ఉచితంగా ఈ పథకం ద్వారా అందజేస్తున్నారు. బోధన్ నియోజకవర్గంలోని బోధన్ రాకాసీపేట్ అర్బన్ హెల్త్ సెంటర్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మంగళవారం ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ పథకాన్ని ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి నెలలో లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్యాన్సర్ వ్యాధిపై మహిళలకు అవగాహన లేక, అపోహలకు దారితీస్తున్న సందర్భంగా వారికి పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకం ద్వారా చర్యలు చేపట్టింది.
ఈ పథకంలో డయాగ్నోస్టిక్స్, క్యాన్సర్ స్క్రీనింగ్, పోషకాహార లోపంతో వచ్చే సమస్యలు, మూత్ర సంబంధ సమస్యలు, మెనోపాజ్ సమస్యలు, సుఖవ్యాధులు, మెన్స్ట్రువల్, కుటుంబ నియంత్రణ సంతానలేమి తదితర సమస్యలతో పాటు బీపీ, షుగర్ వ్యాధులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్లో వేల రూపాయల ఖర్చు, సమయం వృథా కాకుండా బోధన్ అర్బన్ హెల్త్ సెంటర్లో అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆరోగ్య మహిళ పథకం ద్వారా వైద్యులు అందిస్తున్న సేవలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
బోధన్ దవాఖానలో ప్రతి మంగళవారం సుమారు 140 మందికి పరీక్షలు..
బోధన్లో ‘ఆరోగ్య మహిళ’ పథకం కింద కేటాయించి రాకాసీపేట్ అర్బన్ హెల్త్సెంటర్లో ప్రతి మంగళవారం సుమారు 140 మంది మహిళలు వైద్యపరీక్షలు చేయించుకుంటున్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈ పథకంపై వార్డుల వారీగా, గ్రామాల్లో ఆశకార్యకర్తలు, ఏఎన్ఎంలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, పట్టణంలో మెప్మా సిబ్బంది మహిళలకు అవగాహన కల్పిస్తూ పరీక్షలు చేయిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 4 వేల మంది మహిళలకు పైగా వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేయడంతో పాటు మందులు అందజేశామని దవాఖాన వైద్యురాలు అంజలీ జాంకార్ తెలిపారు. ప్రతి మంగళవారం అర్బన్ హెల్త్ సెంటర్లో రోజువారీ ఓపీతో పాటు ఆరోగ్య మహిళ పథకం కింద మహిళలు పరీక్షలు చేయించుకుంటున్నారు. దీంతో దవాఖాన మంగళవారం సందడిగా కనిపిస్తున్నది. పరీక్షలు నిర్వహించే రోజు ఎవరికీ సెలవు ఉండదని, అత్యవసర పరిస్థితి ఉంటే ఇతర వైద్యురాలిని నియామకం చేసి వెళ్లాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.
ఇక్కడే వైద్యం చేయించుకుంటున్నాను
బోధన్ సర్కార్ దవాఖానాలో వైద్యం బాగున్నది. అందుకే ఇక్కడే చికిత్స చేయించుకుంటున్నాను. నాకు ఆరోగ్యం బాగా లేనప్పుడు దవాఖానకు వస్తే డాక్టర్లు మంచిగా చూశారు. మందులు కూడా ఉచితంగా ఇచ్చారు. బోధన్ దవాఖానలో మంచి సౌలత్లు కల్పించారు. సర్కార్కు కృతజ్ఞతలు.
– భానుబీ, రాకాసీపేట్, బోధన్
డాక్టర్లు మంచిగా చూస్తున్నారు..
ప్రైవేట్ దవాఖాన్లకు పోతే పైసలు అయిపోతున్నాయి. పొద్దంతా పోతుంది. ఇప్పుడు ఈ దవాఖానలో సర్కారు ఇస్తున్న సౌలత్ నాకు మంచిగా పనిచేసింది. డాక్టర్లు మంచిగా పరీక్షలు చేసి మందులు ఇచ్చిండ్రు. నెలనెలా నాకు కావాల్సిన మందులు ఉత్తగానే ఇస్తున్నారు. గరీబోల్లకు ఈ దవాఖాన మంచిగా ఉన్నది. ఈ కార్యక్రమం చాలు చేసిన ప్రభుత్వానికి, సీఎం సార్కు, ఎమ్మెల్యేకు, డాక్టర్లకు మా దీవెనలు ఉంటాయి.
-రాజమణి, పాండుఫారం, బోధన్