బాల్కొండ, జనవరి 22: మండల కేంద్రంలో శునకాలు స్వైరవిహారం చేస్తున్నాయి. వీధుల్లో తిరగాలంటే ప్రజలు జంకుతున్నారు. రాత్రుల్లో ఇండ్లకు చేరుకోవాంటే ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనదారులకూ కష్టాలు తప్పడం లేదు. నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు వెంట పడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వాకింగ్కు వెళ్లే వారి వెంట పడుతున్నాయి. కొన్ని నెలలుగా వీటి బెడద ఎక్కువైంది. జీపీ పాలకవర్గం, అధికారులు స్పందించి శునకాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఫిర్యాదు చేస్తే పట్టుకుంటారు
గ్రామాల్లో ఎక్కడైనా కుక్కల బెడద తీవ్రంగా ఉందని పంచాయతీ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే ప్రత్యేక కార్మికుల ద్వారా వాటిని పట్టుకుని దూరంగా వదిలేస్తాం. గ్రామపంచాయతీలో ఉన్న కార్మికులు పారిశుద్ధ్య సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. కుక్కలతో ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించాం.
– సంతోష్కుమార్, ఎంపీడీవో, బాల్కొండ