నిజామాబాద్, సెప్టెంబర్ 8, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గులాబీ పార్టీ గుబాళిస్తున్నది. బీఆర్ఎస్కు రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. ఎన్నికలకు ముందే ఊరూరా ప్రజాభిమానం వెల్లువెత్తుతున్నది. ఇప్పటికే అనేక గ్రామాలు, తండాలు గులాబీ పార్టీకి అనుకూలంగా తీర్మానాలు చేశాయి. కామారెడ్డి నుంచి పోటీ చేయనున్న సీఎం కేసీఆర్కు అనేక పల్లెలు జైకొట్టాయి. కారుకే ఓటేస్తామని ఏకగ్రీవంగా తీర్మానించాయి. ఇదే ఒరవడి అటు బాన్సువాడ, బాల్కొండ నియోజకవర్గాల్లో ప్రారంభమైంది. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి అనేక గ్రామాలు, కుల సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ కూడా రాక మునుపే బీఆర్ఎస్కు ప్రజాభిమానం పోటెత్తుతుండడంతో ప్రతిపక్షాలు బెంబేలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా ఇక్కడి నుంచి బరిలోకి దిగనుండడంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పరేషాన్లో పడ్డాయి. ఉమ్మడి జిల్లాలో ముందు నుంచీ బలంగా ఉన్న ఉద్యమ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కనీస పోటీ ఇవ్వడం కూడా కష్టమేననే ప్రచారం బలంగా సాగుతున్నది.
గతేడాది అక్టోబర్లో బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సరికొత్త నినాదంతో దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. తెలంగాణలో అమలైన విప్లవాత్మక పథకాల సాక్షిగా సరిహద్దు రాష్ర్టాల ప్రజల మనసులను గెలుచుకున్న కేసీఆర్కు అన్ని చోట్ల మద్దతు దక్కుతున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో కదనరంగంలో దిగి యుద్ధానికి సిద్ధమన్న సంకేతాలను గులాబీ దళపతి అందించారు. ఏకంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించి తనదైన మార్క్ను కేసీఆర్ చాటుకున్నారు. ఇందులో కామారెడ్డి నుంచి సైతం కేసీఆర్ పోటీ చేయబోతున్నట్లుగా చెప్పడంతో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఒకప్పుడు ఉద్యమ పార్టీకి అన్నీ తామై నడిచిన ఉమ్మడి జిల్లా నుంచే బీఆర్ఎస్ అధినేత పోటీకి వస్తుండడంతో ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 21న ప్రకటన చేయ గా గంటల వ్యవధిలోనే ప్రజలంతా కేసీఆర్ రాకను హర్షిస్తూ సంబురాలు చేసుకున్నారు. అంతేకాకుండా ఊరూరా కేసీఆర్కే ఓటేస్తామంటూ, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే మా ఓటంటూ కుల సంఘాల వారీగా, గ్రామ పంచాయతీల్లోనూ పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు చేస్తున్నారు. కనీసం అభ్యర్థులను ప్రకటించుకునే స్థితిలో లేని కాంగ్రెస్, బీజేపీలైతే ఈ పరిణామాలతో కంగుతింటున్నాయి. ప్రజలంతా ఐక్యమవుతుండగా ఈ సంప్రదాయం ఇప్పుడు బాన్సువాడ, ఆర్మూర్, బాల్కొండ వంటి నియోజకవర్గాలకూ వ్యాప్తి చెందడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
గులాబీ కంచుకోట ఉమ్మడి నిజామాబాద్…
తెలంగాణ తెచ్చిన పార్టీగా దేశంలోనే అత్యధిక పార్టీ సభ్యత్వాలు కలిగిన ప్రాంతీయ పార్టీగా రికార్డుకెక్కిన భారత రాష్ట్ర సమితి 22 వసంతాలను దాటుకొని విజయవంతంగా పరుగులు తీస్తున్నది. రాష్ట్ర సాధనోద్యమంలో భాగంగా అలుపెరగని పోరా టం చేసిన గు లాబీ పార్టీ… అనేక ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిం ది. కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ ప్రభుత్వానికే ప్రజలంతా నిలబెట్టారు. 2014, 2018లో రెండుమార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్కే పట్టం కట్టారు. ఉద్యమ నాయకుడే… సీఎంగా ఉండడంతో స్వరాష్ట్ర ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగుతున్నది. ప్రజల అభీష్టం మేర కు పథకాలు అమలవుతున్నాయి. మరోవైపు ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన బీఆర్ఎస్ గడిచిన కొద్ది కాలంలో రికార్డు స్థాయి సభ్యత్వాలతో జాతీయ పార్టీలకు ధీటుగా నిలిచింది. క్షేత్ర స్థాయి లో మరే రాజకీయ పార్టీకి లేని విధంగా కార్యకర్తల బలం గులాబీ జెండాకు దక్కింది. ఇలా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో లక్షలాది మందితో కంచుకోటగా బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. 2001లో ఉద్యమ పార్టీకి పట్టం కట్టిన ఇందూర్ గడ్డ రాబోయే ఎన్నికల్లోనూ అదే స్ఫూర్తిని ప్రదర్శించడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
రోల్ మోడల్గా కేసీఆర్…
దేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకున్న సీఎం కేసీఆర్ ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే భారత రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత వ్యవసాయ రంగం నిరాదారణకు గురైంది. దశాబ్దాల తరబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంత వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశాయి. దీంతో రైతుల ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోయింది. రైతుకు ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్యే శరణ్యంగా భావించాడు. రైతు ఇలా సమస్యలతో సతమతమవుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతమై కేసీఆర్ సారథ్యంలో ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. పురుడు పోసుకున్న తెలంగాణకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని పరుగులు పెట్టించేందుకు సంస్కరణలను తీసుకు వచ్చి అమలు చేశారు. రైతు కేంద్రంగా సాగిన బహుళ మార్పుతో దేశ వ్యాప్తంగా గుర్తింపు సాధ్యమైంది. తెలంగాణలో విజయవంతమైన అనేక పథకాలతో రోల్ మోడల్గా నిలిచిన మన రాష్ట్రం యావత్ దేశానికి ఆదర్శం అవుతున్న ది. పక్కనే ఉన్న మహారాష్ట్రలోని రైతులు, సామాన్య ప్రజానీకమంతా కేసీఆరే తమకు నాయకత్వం వహించాలంటూ ఎలుగెత్తి చాటుతున్నారు.
తీర్మానాల హోరు…
కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్కు మద్దతు తెలుపుతూ జరుగుతున్న తీర్మానాలు జోరందుకుంటున్నాయి. మొదట కామారెడ్డి నియోజకవర్గంలో గర్గుల్ గ్రామంలో తీర్మానాలు జరిగాయి. ఈ గ్రామంలో పలు సామాజిక వర్గాలకు చెందిన వారంతా కేసీఆర్కు మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటిస్తూ ఊరంతా ర్యాలీ తీసి మద్దతు లేఖను స్థానిక సర్పంచ్కు సైతం అందించారు. ఇదే స్ఫూర్తితో మాచారెడ్డిలో 10 గ్రామ పంచాయతీలు, పాల్వంచలోని ఒక గ్రామంలోనూ స్వచ్ఛందంగా తీర్మానాల కార్యక్రమాలు ఉవ్వెత్తున జరిగాయి. తదనంతరం రామారెడ్డి మండలంలోనూ తీర్మానాలు జరిగాయి. కేసీఆర్కు జై కొడుతూ బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతూ చేస్తున్న ఏకగ్రీవాల సంప్రదాయం నియోజకవర్గమంతా వ్యాప్తి చెందింది.
ఈ జోరు కాస్త బాన్సువాడ నియోజకవర్గంలోనూ చూపుతున్నది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికే మద్దతు అంటూ పలు గ్రామాల్లో తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. బాల్కొండ నియోజకవర్గాల్లోనూ ఇప్పటికే పలు గ్రామాలు, కులసంఘాల వారు పెద్ద ఎత్తున మంత్రి వెంటే ఉంటామంటూ తీర్మానాలు చేస్తున్నారు. మూకుమ్మడి నిర్ణయాల వెనుక ప్రజలకు కేసీఆర్ పరిపాలనలో జరిగిన ప్రయోజనం, అభివృద్ధి ప్రధానంగా ఆకట్టుకుంటున్నది.