‘స్థానిక’ సంస్థల ఎన్నికల సందడి మొద లు కానున్నది. ప్రస్తుత పాలకవర్గాల గడువు జనవరి 31తో ముగియనున్నది. ఆలోపే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. సన్నాహాలు ప్రారంభించాలని, ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులను నియమించాలని కలెక్టర్లను ఆదేశించింది. దీంతో ఆశావహుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొన్నది. ‘పంచాయతీ’ బరిలోకి దిగేందుకు యువత ఆసక్తి చూపుతున్న ది. పోటీ కోసం యువ నాయకత్వం రంగం సిద్ధం చేసుకుంటున్నది. ఒకవైపు, ప్రజల్లో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి యువ నాయకులు చొరవ చూపుతున్నారు. మరోవైపు, గ్రామంలోని ముఖ్య నా యకులను కలుస్తూ వారి ఆశీస్సులు పొందేందుకు యత్నిస్తున్నారు. రిజర్వేషన్లు అనుకూలిస్తే సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఆశావహులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు, కామారెడ్డి జిల్లాలో 526 పంచాయతీలు ఉన్నాయి. ఆయా పాలకవర్గాల గడువు వచ్చే జనవరి 31తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఈసీ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులను నియమించాలని ఆదేశించింది. ఓటరు జాబితాల రూపకల్పన, పోలింగ్ కేంద్రాల గుర్తింపు తదితర పనుల్లో యం త్రాంగం నిమగ్నమైంది. అయితే, ఇటీవలే కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు పచ్చజెండా ఊపుతుందా.. లే దా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం అనుమతిస్తేనే స్థానిక సంస్థల ఎన్నికలకు అడుగు ముందుకు పడుతుంది. గడువు లోపు ఎలక్షన్లు నిర్వహించలేకపోతే ఇన్చార్జీలను పెట్టి పాలనను కొనసాగించే అవకాశమున్నది. లోక్సభ ఎన్నికలు ముందున్న తరుణంలో స్థానిక పోరుకు ప్రభుత్వం సై అంటుందా.. లేదా? అన్నది ఆసక్తిగా మారింది.
శాసనసభ ఎన్నికల సమరం ముగిసింది. స్థానిక సంస్థల పోరుకు త్వరలోనే తెర లేవనున్నది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల బరిలోకి దిగేందుకు యువత ఉత్సాహం చూపుతున్నది. సర్పంచ్ పీఠాన్ని అధిష్టించేందుకు ఇప్పటినుంచే రంగం చేసుకుంటున్నది. ఈసారి జరిగే జీపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా మంది యువకులు ఆసక్తిగా ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో సగానికంటే ఎక్కువ స్థానాల్లో యువ నాయకత్వమే బరిలోకి దిగే అవకాశం కనిపిస్తున్నది. వచ్చే జనవరి 31తో ప్రస్తుత పాలకవర్గాల గడువు ముగియనున్నది. ఆలోపు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందా.. లేక లోక్సభ ఎన్నికల తర్వాత ‘స్థానిక’ సమరానికి సై అంటుందా? అన్న దానిపై ఆసక్తి నెలకొన్నది. మరోవైపు, రిజర్వేషన్ల ఖరారుపైనా ఆశావహుల్లో అంతులేని ఉత్కంఠ కనిపిస్తున్నది.
– రాజంపేట/పెద్దకొడప్గల్, డిసెంబర్ 27
రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి చూపని యువత ధోరణిలో ప్రస్తుతం మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. రాజకీయాల్లోకి రావడానికి మక్కువ చూపుతున్నది. అందుకు పంచాయతీ ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని ఎంతో మంది యువకులు భావిస్తున్నారు. అటు రాజకీయ హోదాను అనుభవించేందుకు, అదే సమయంలో ఇటు ప్రజా సేవ చేయొచ్చన్న ఆలోచనతో చాలా మంది యువ నేతలు పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఊరిలో అధికారం చెలాయించవచ్చనే భావనతో ఎంతో మంది సర్పంచ్ పీఠంపై కన్నేశారు. దీంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువకులదే హవా స్పష్టంగా కనిపించే అవకాశముంది.
పోటీకి ఆసక్తి చూపుతున్న యువకులు ఇప్పటికే కదనరంగంలోకి దూకేశారు. నిత్యం జనంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. ప్రజల్లో గుర్తింపు పొందేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, పల్లెల్లోని సీనియర్ నాయకులు, మాజీ సర్పంచులు, ఓటర్లను ప్రభావితం చేసే నేతలను కలుస్తున్నారు. కానీ, ఎక్కడా తమ మనస్సులో మాట బయట పెట్టడం లేదు. రిజర్వేషన్ తమకు అనుకూలిస్తుందో, లేదోనని ఆశావహులను ఆందోళనకు గురిచేస్తుండడమే అందుకు కారణం. రిజర్వేషన్ కలిసొస్తే అప్పుడు నేరుగా రంగంలోకి దిగాలని భావిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరుణంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రిజర్వేషన్లను పదేండ్ల పాటు కొనసాగిస్తూ చట్టం చేసింది. అంటే ఒక గ్రా మంలో రెండు పర్యాయాలు నిర్వహిం చే సర్పంచ్ ఎన్నికలకు ఒకే రిజర్వేషన్ వర్తిస్తుందన్న మాట. కేసీఆర్ ప్రభు త్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. 2019 ఎన్నికల్లో నిర్ణయించిన రిజర్వేషన్లనే ఈసారి కొనసాగించాల్సి ఉం టుంది. అయితే, కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తుందా.. లేదా కొత్తగా రిజర్వేషన్లు ప్రకటిస్తుం దా? అన్నది ఆశావాహులను ఆందోళనకు గురి చేస్తున్నది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించారు. అలాగే, సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు కేటాయిస్తుండడంతో యువ నాయకులు ఎటూ తేల్చులేక పోతున్నారు. పోటీకి ఆసక్తి ఉన్నా తమ మనసులోని మాటను బయట పెట్టడం లేదు. అవకాశమొస్తే మాత్రం బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు.