చందూర్, సెప్టెంబర్ 20 : తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరెక్కడా లేవని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇతర రాష్ర్టాల్లో ఉన్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. చందూర్ మండలం ఘన్పూర్ గ్రామంలో బుధవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎస్టీ కమ్యూనిటీ హాల్ (రూ. 10లక్షలు), ఎస్సీ కమ్యూనిటీ హాల్ (రూ.10లక్షలు), గంగపుత్ర కమ్యూనిటీ హాల్ (రూ.10లక్షలు), ప్రభుత్వ పాఠశాల భవనం (రూ. 18లక్షలు), మహిళామండలి భవనం (రూ. 10లక్షలు), పంచాయతీ కార్యాలయం (రూ. 26లక్షలు)తోపాటు డబుల్ బెడ్రూం ఇండ్లు, అంగన్వాడీ కాంపౌండ్ వాల్, సీసీ రోడ్లు, డ్రైనేజీలను ప్రారంభించారు.
అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. గ్రామంలోని కుల సంఘాల భవనాలు, ఇతర అభివృద్ధి పనులకు కేటాయించిన నిధుల వివరాలను వెల్లడించారు. దీంతోపాటు పంట పొలాలకు వెళ్లే 10 కిలో మీటర్ల దారి కోసం రూ.20 లక్షలు అందజేశామని తెలిపారు. గ్రామంలో 46 పేద కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశామని, గుడిసెలు, రేకుల షెడ్లలో ఉన్నవారికి గృహలక్ష్మి పథకం మంజూరు చేస్తామన్నారు. శివాలయం అభివృద్ధికి రూ. 10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ పసికందు నుంచి మొదలుకొని పండు ముసలి వరకు సంక్షేమ పథకాలు అందజేస్తున్న రాష్టం తెలంగాణ ఒక్కటే అని అన్నారు. 75 ఏండ్లపాటు పాలించినవారిలో ప్రజల కోసం ఆలోచించిన నాయకులే లేరని, అది కేసీఆర్కే సాధ్యమైందన్నారు.
మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడం తమకు తెలియదని అన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నదని, నేడు బస్సుల్లో డీజిల్ లేక సర్వీసులను కూడా బయటికి తీసే పరిస్థితి లేదన్నారు. బెంగళూరు వంటి మహా నగరంలోనూ కరెంట్ కోతలు పెడుతున్నదన్నారు. ప్రజలకు చేరువలో ఉంటూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందజేస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరారు. గ్రామానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు స్పీకర్కు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసి కాపీని సభాపతికి అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ కవిత, ఎంపీపీ లావణ్యా రాంరెడ్డి, తహసీల్దా శాంత, ఎంపీడీవో నీలావతి, సర్పంచులు దాసరి గంగారాం, సాయారెడ్డి, బొడ్డోల్ల సత్యనారాయణ, దేవీసింగ్, రవి, అంబర్సింగ్, ప్యారం అశోక్, మాధవరెడ్డి, కృష్ణాగౌడ్, లాలబోయి, నాయకులు పాల్గొన్నారు.