నిజాంసాగర్, సెప్టెంబర్ 16: ‘పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ప్రతి గ్రామ పంచాయతీకీ ఒక ట్రాక్టర్, ట్యాంకరు, కంపోస్టు షెడ్డు, క్రీడా ప్రాంగణాలతో ప్రస్తుతం ఏ గ్రామం చూసినా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. ఇలాంటి పథకాలు ఏ రాష్ట్రంలో లేవు. కేవలం తెలంగాణలో మాత్రమే కొనసాగుతున్నాయి.’ అని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. బిచ్కుంద మండలంలోని పత్లాపూర్, హస్గుల్ గ్రామాల్లో రూ.20లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలు, హస్గుల్లో తెలుగు, హిందీ మీడియం పాఠశాలలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం చేసిన అనంతరం హస్గుల్లో పల్లె దవాఖానను ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. ఇక్కడ అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాల్లో లేకపోవడంతోనే తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలబడిందని అన్నారు.
రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు.. ఇలా ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడంతో నేడు రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకూ బీటీ రోడ్లు వేయించామని తెలిపారు. తండాలు, 500 జనాభా దాటిన గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి.. అన్ని గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలను నిర్మించుకుంటున్నామన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రూ.200, రూ.500 ఉన్న పింఛన్ నేడు రూ.2016, 4016కు పెంచినట్లు తెలిపారు. పల్లె దవాఖానల ఏర్పాటుతోపాటు జిల్లాకో మెడికల్ కళాశాలను మంజూరు చేయడంతో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. కార్యక్రమంలో అశోక్పటేల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రావ్దేశాయ్, నాయకులు రాజు శ్రీహరి, నాగ్నాథ్పటేల్, బస్వరాజ్పటేల్, బాలు, బాలాజీ, జయశీలా యాదవ్రావు, జంగం శివకాంత్, ఆయా గ్రామాల సర్పంచులు ఆరుణ్కుమార్, మారుతి తదితరులు పాల్గొన్నారు.
డప్పు కొట్టి ఆకట్టుకున్న ఎమ్మెల్యే..
పత్లాపూర్ గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన డప్పు కార్యక్రమంలో ఎమ్మెల్యే హన్మంత్షిండే డప్పు కొట్టి ఆకట్టుకున్నారు. ఆయన డప్పు కొట్టడాన్ని గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు.