ఖలీల్వాడి, డిసెంబర్ 7 : అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్న ఉద్దేశంతో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం గడువు నేటితో (గురువారం) ముగియనున్నదని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. సంబంధిత అధికారులతో బుధవారం సెల్కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంపై సమీక్షించారు. నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఓటు హక్కు నమోదు కోసం ఇప్పటివరకు 27,154 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. అర్హులై ఉండి దరఖాస్తు చేసుకోని వారు వెంటనే ఎన్రోల్ చేసుకోవాలని సూచించారు.
అన్ని పోలింగ్ బూత్ల వద్ద బీఎల్వోలు అందుబాటులో ఉన్నారని చెప్పారు. సిబ్బంది కూడా ఇంటింటికి తిరుగుతూ ఓటు హక్కు నమోదు ప్రక్రియ చేపడుతున్నారని తెలిపారు. ఓటరు కార్డులో మార్పులు, చేర్పుల కోసం కూడా ఫారం -7 ద్వారా, ఇతర ప్రాంతానికి మార్చుకునేందుకు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్పులు, చేర్పులకు సంబంధించి ఇప్పటివరకు 20,141 దరఖాస్తులు, ఇతర ప్రాంతాలకు ఓటు హక్కును బదిలీ చేయాలని కోరుతూ 5,030 దరఖాస్తులు వచ్చాయని వివరించారు.
వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, ఆన్లైన్లో వివరాలు నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇతర ప్రాంతానికి వలస వెళ్లినవారు కొత్త ప్రదేశంలోని పోలింగ్ బూత్లో పేరును నమోదు చేసుకున్నారా లేదా అన్నది నిర్ధారణ చేసుకున్న తర్వాతే జాబితా నుంచి పేరును తొలగించాలని సూచించారు. మృతిచెందిన వారి వివరాలను పరిశీలించి పేర్లను తొలగించాలన్నారు. సెల్ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో చందర్, డీపీవో జయసుధ, ఆర్డీవోలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, ఎన్నికల విభాగం అధికారులు పవన్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.