ఖలీల్వాడి/మాక్లూర్, జనవరి 18 : దృష్టి లోపాలను దూరం చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని స్త్రీశక్తి భవన్లో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కంటివెలుగు శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. శిబిరాల నిర్వహణ కోసం అవసరమైన బృందాలు, సామగ్రిని సమాయత్తం చేశామన్నారు. 18 ఏండ్లు దాటిన ప్రతిఒక్కరూ నేత్ర పరీక్షలు చేయించుకోవాలన్నారు. శిబిరాల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 70 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో బృందం ప్రతిరోజూ 120-130 మందికి స్క్రీనింగ్ నిర్వహిస్తుందని తెలిపారు. అవసరమైన వారికి శిబిరాల్లోనే మందులు, దృష్టి లోపమున్న వారికి కంటి అద్దాలు అందిస్తారని వెల్లడించారు. ప్రత్యేకంగా అద్దాలు అవసరమున్న వారి వివరాలను ఆన్లైన్లో పొందుపర్చి పక్షం రోజుల్లో కంటి అద్దాలను ఇంటికి చేర్చేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు.
మాక్లూర్ మండలంలో కంటివెలుగు ప్రారంభోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ నారాయణరెడ్డి బుధవారం పరిశీలించారు. కల్లడి గ్రామంలోని మున్నూరుకాపు సంఘం భవనం, బొంకన్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న శిబిరాలను ఆయన సందర్శించారు. శిబిరాలకు చేరుకున్న సామగ్రి వివరాలు, టేబుళ్ల వారీగా నిర్వహించాల్సిన విధుల గురించి సిబ్బందిని ప్రశ్నిస్తూ వారి సన్నద్ధతపై తెలుసుకున్నారు. కంటి పరీక్షల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. లోటుపాట్లకు తావు లేకుండా పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తూ శిబిరాలను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. వైద్య బృందంలోని సభ్యులు సమయపాలన పాటించాలని, ఉదయం 8.30 గంటల లోపే శిబిరాలకు చేరుకోవాలన్నారు. ప్రతిరోజూ నిర్దేశిత సంఖ్యలో ప్రజలు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు శిబిరాలు పూర్తిస్థాయిలో విజయవంతమయ్యేలా ప్రజాప్రతినిధులు సైతం సహకరించాలని కోరారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శంకర్, ఎంపీడీవో జయక్రాంతి, పీహెచ్సీ వైద్యురాలు సరిత, ఎంపీవో శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది ఉన్నారు.