భీమ్గల్, డిసెంబర్ 24: రోడ్లను కాపాడుకోవడం అందరి బాధ్యత అని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మంత్రి వేముల శనివారం దేవక్కపేట నుంచి కారేపల్లి మీదుగా వెళ్తున్నారు. ఈ క్రమంలో బీటీ రోడ్డుపై కేజ్వీల్ ట్రాక్టర్ నడిచినట్లు ఉండడాన్ని ఆయన గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి రోడ్డును పరిశీలించారు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన రోడ్లను పట్టీలు లేకుండా కేజ్వీల్ ట్రాక్టర్లను నడిపి ధ్వంసం చేయడం సరికాదన్నారు. వాహనాలను నడుపుతున్న యజమానులకు అవగాహన కల్పించాలని అక్కడే ఉన్న పోలీసు సిబ్బందికి మంత్రి ఆదేశించారు.
గ్రామాల్లో సమావేశాలను ఏర్పాటు చేసుకొని రోడ్లపై కేజ్వీల్ ట్రాక్టర్లను పట్టీలు లేకుండా నడపబోమని తీర్మానం చేసి దాని కాపీని తహసీల్దార్కు అందజేయాలని సూచించారు. గ్రామస్తులు తీర్మానం చేసేంతవరకు ఆయా గ్రామాల మీదుగా బీటీ రోడ్లు వేయాల్సి ఉంటే పనులను ప్రారంభించవద్దని మంత్రి అధికారులకు సూచించారు. మంత్రి వెంట ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.