కంఠేశ్వర్, ఫిబ్రవరి 6: ప్రజాపాలన కార్యక్రమంలో మహాలక్ష్మీ పథకం కోసం ప్రజలు సమర్పించిన దరఖాస్తులపై నేటి నుంచి ప్రత్యేక బృందాలు సర్వే నిర్వహించనున్నట్లు నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల్లో తప్పిదాల సవరణకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు చెప్పారు. మహాలక్ష్మీ పథకం కింద వంట గ్యాస్ సిలిండర్ రూ.500కు అందించేందుకు సమగ్ర వివరాలు అవసరమని పేర్కొన్నారు.
గ్యాస్ ఏజెన్సీ పేరు, వినియోగదారు నంబర్,రేషన్ కార్డు నంబర్ వంటి వివరాలు పలువురు సరిగ్గా పొందుపర్చలేదని, అలాంటి దరఖాస్తులను సర్వే చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ను రూపొందించినట్లు తెలిపారు. గ్రామాల్లో ఎంపీడీవో, తహసీల్దార్లు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు, ఇతర అధికారుల నేతృత్వంలో సర్వే జరుగుతుందన్నారు. సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు.