ఖలీల్వాడి, జనవరి 7 : మోదీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక పోరాటాన్ని తీవ్రం చేద్దామని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు టి.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఐఎఫ్టీయూ మహాసభల సందర్భంగా నగరంలోని ముదిరాజ్ సంఘం ఫంక్షన్హాల్లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.భూమన్న అధ్యక్షతన ప్రాంతీయ సదస్సును శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఎన్నికల వాగ్దానాలను విస్మరించి, దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మివేసి, ప్రజాసంపదను కొద్దిమంది చేతుల్లో పెడుతున్నారని ఆరోపించారు. స్వదేశీ పరిశ్రమలను రక్షిస్తానని, ఉపాధి రక్షణ కోసం ఉద్యమిస్తానని హామీ ఇచ్చి మరిచారన్నారు. 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లకు కుదించి, కార్మిక హక్కులను హరించి కంపెనీ యజమానులకు లబ్ధి చేకూర్చారని ఆరోపించారు.
కార్మికులకు సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐంఎల్ న్యూడెమోక్రసీ జిల్లాకార్యదర్శి ఆకుల పాపయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్.భూమేశ్వర్, రాష్ట్ర కార్యదర్శి దాసు, రాష్ట్ర నాయకులు సూర్యశివాజీ, శివకుమార్, హరిత, ఆకుల రాములు, ఎండీ ఖాజా మోయినుద్దీన్, ఆకుల రాములు, అరుణోదయ జిల్లా కార్యదర్శి అబ్దుల్, రంజిత్, చిట్టి, సత్యనారాయణ, నిజామాబాద్ జన సాంస్కృతిక కళావేదిక కన్వీనర్ సిర్ప లింగయ్య, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.