ఆర్మూర్, జనవరి 22: ప్రతి బుధవారం స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని విధిగా నిర్వహించాలని పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జీవన్రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని మినిస్టర్ క్వాటర్స్లో ఆదివారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో చేపట్టిన అబివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, కంటి వెలుగు కార్యక్రమం అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్మూర్లో ప్రతి బుధవారం సాయంత్రం అంగడి ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఉదయమే పట్టణాన్ని పరిశుభ్రం చేయాలని సూచించారు. మొత్తం 36 వార్డుల్లో అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును తాను సమీక్షించానని, అధికారుల పని తీరు బాగుందన్నారు. ఆర్మూర్ పట్టణంలో మిగిలిన 270 పనులు సోమవారం నుంచి మొదలవుతాయని, యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. నియోజకవర్గంలో కంటి వెలుగు కార్యక్రమం అద్భుతంగా ఉందని అన్నారు.
కంటి సమస్యలున్నవారికి అప్పటికప్పుడే రీడింగ్ కళ్లద్దాలు ఇస్తున్నామని, ప్రిస్కిషన్ కళ్లద్దాలు అవసరమైన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంతటి అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు పాదాభివందనాలు తెలియజేశారు. పథకం అమలుకు కృషి చేస్తున్న మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఉంటే వారికి తాను అండగా ఉంటానని తెలిపారు.
ఇప్పటికే 25వేల మందికిపైగా బాధితులకు సీఎంఆర్ఎఫ్, ఎల్వోసీ చెక్కులు ఇచ్చి మెరుగైన వైద్యం అందించామని అన్నారు. సీఎంఆర్ఎఫ్ సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందుకోసం తన పీఏలు, పీఆర్వోలతో ప్రతిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశానని తెలిపారు. సమావేశంలో ఆర్మూర్ మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ మనోహర్, డీఈ భూమేశ్వర్, ఏఈ రఘు, టీపీఎస్ వినిత్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్, అకౌంట్ అధికారి రాందాస్ తదితరులు పాల్గొన్నారు.