సామాన్యులకు ఎంతో సులభం
ధరణి సేవలు సామాన్యులకు ఎంతో సులభమయ్యాయి. జిల్లాలోని వ్యవసాయ భూముల పూర్తి వివరాలు ధరణి పోర్టల్లో నిక్షిప్తమై ఉన్నాయి. భూముల రిజిస్ట్రేషన్ల సందర్భంగా ఎలాంటి పొరపాట్లు జరగవు. తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతున్నది. ధరణి సేవలు పారదర్శకమైనవి. భూముల రికార్డుల్లో ఎప్పటికప్పుడు కొనుగోలు, విక్రయదారుల పేర్లు నమోదవుతాయి.
– రాజాగౌడ్, ఆర్డీవో, బాన్సువాడ
నాలుగు నిమిషాల్లో నాలా..
ఎల్లారెడ్డి,మే 27: పరిస్థితి చానా మారింది. ఇంతకుముందు నాలా చేసుకోవాలంటే కనీసం నాలుగు నెలలు పట్టేది. తహసీల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఆర్ఐ, తహసీల్దార్, ఆర్డీవో సార్లు తనిఖీలు చేసేటోళ్లు. దరఖాస్తు చేసుకున్న వ్యవసాయ భూమిని నాలా చేయాలని కోరితే వాటికి సంబంధించిన 1954-55 ఖాస్రా పహాణి, తర్వాత ప్రతి పది సంవత్సరాలకు ఒక పహాణి తీసుకు రమ్మని చెప్పేది. వాటి కోసం రెండు నెలలు తిరగాల్సి వచ్చేది. అంతా కలిపితే కనీసం నాలుగు నెలలు పట్టేది నాలా కోసం. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్లో నిన్న(శుక్రవారం) దరఖాస్తు చేసుకున్నాను. ఈ రోజు వస్తే కేవలం గంట వ్యవధిలోనే నాలా చేసి సర్టిఫికేట్ చేతికి ఇచ్చారు. అప్పటికీ ఇప్పటికి ఎంతో తేడా ఉన్నది. దీనికి కారణం కేవలం ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ మాత్రమే.
– పార్థసారథి, ఎల్లారెడ్డి
ధరణితో సులువుగా రిజిస్ట్రేషన్
మాచారెడ్డి,మే 27: ధరణితో సులువుగా భూమి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ధర ణి రాకముందు దోమకొండకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకునేవాళ్లం. ఉదయం వెళ్లితే సాయంత్రం వరకు పని అయ్యేది కాదు. ఇప్పుడు తహసీల్ కార్యాలయంలో నిమిషాల వ్యవధిలో పని పూర్తవుతున్నది. కేవలం ధరణి ద్వారానే. రాత పద్ధతిలో పట్టా పాస్ పుస్తకం ఏండ్లకు ఏండ్లుగా తిరిగే వ్యవస్థను కాంగ్రెసోళ్లు మళ్లీ తెస్తామనడం మంచి పద్ధతి కాదు. సరైన వ్యవస్థను మంటకలుపుతామంటే ఊరుకోం. రైతులను ఇబ్బంది పెట్టాలని చూసే పార్టీలను అధికారంలోకి తేం. కాంగ్రెసోళ్లకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతాం.
-ఆశన్నగారి రమేశ్గౌడ్, భవానీపేట, పల్వంచ మండలం.
కాంగ్రెసోళ్ల మూర్ఖత్వమే..
మాచారెడ్డి,మే 27 : ధరణి సాఫ్ట్వేర్ రాకముందు భూములకు సంబంధించిన ఎన్నో సమస్యలు ఉండేవి. నా భూమికి సంబంధించిన వివరాలను ధరణి సహాయంతో మొబైల్ఫోన్లో చూసుకుంటున్న. వ్యవసాయ భూమి మార్పిడి కోసం ఇంతకుముందు దోమకొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు తహసీల్ కార్యాలయంలోనే ధరణి ద్వారా పని వెంటనే పూర్తవుతున్నది. రైతులకు ఎంతో సమయ భారం తగ్గింది. కాంగ్రెసోళ్లు ధరణిని రద్దు చేస్తామనడం హాస్యాస్పదం. రైతులు ప్రశాంతంగా ఉంటే వాళ్లకు ఇబ్బందిగా ఉందేమో.. గతంలో పడ్డ బాధలు చాలు.. మళ్లీ రాత పద్ధతి తేవాలనడం మూర్ఖత్వమే. ఇసొంటోళ్లను అసలు అధికారంలోకి రానిస్తమా..
-బట్ట వెంకట్రాములు, ఫరీద్పేట, పల్వంచ మండలం.
వచ్చిన వెంటనే పని అయ్యింది..
ఎల్లారెడ్డి,మే 27 : ఇంతకు మునుపు ఎప్పుడూ రిజిస్ట్రేషన్ కోసం ఆఫీసుకు రాలేదు. నాకు చిన్న పాప ఉన్నది. రిజిస్ట్రేషన్ కోసం ఎంత ఆలస్యం అవుతదో అనుకున్న. వచ్చిన గంటలోపే పని మొత్తం అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పాస్బుక్ ప్రింట్(నకలు) ఇచ్చిండ్రు. పహాణిలో భూమి చేర్చిండ్రు. ఇంతకు మునుపు రిజిస్ట్రేషన్ చేసినంక పట్వారీల కోసం ఎంత తిరిగినా పని కాకుండే. పైసలు ఇయ్యకపోతే పని ఆగిపోతుండె. ధరణి వచ్చినంక తిరుగుడు గోస తప్పింది. ఇంతకన్నా మా రైతులు కోరుకునేది ఏమీ లేదు. సీఎం కేసీఆరు సారు సల్లంగా ఉండాలే. గిసుంటి పనులు చేస్తే రైతులు ఎప్పటికీ యాది మరువరు.
– పోశమణి, సోమరిపేట