నిజాంసాగర్, ఏప్రిల్ 30: మహ్మద్నగర్ మండలంలోని సింగీతం గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేశారు. కానీ ధాన్యాన్ని కాంటా చేయడం మరిచారు. గ్రామంలో ఇటీవల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంతో రైతులు సంతోషించారు. సుమారు 20 రోజుల క్రితం కేంద్రానికి ధాన్యం తీసుకురాగా, ఇప్పటివరకూ కాంటా చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ కేంద్రం వద్ద పంట నూర్పిళ్లు చేపట్టారు. ప్రభుత్వం విధించిన తేమ ప్రకారం ధాన్యం సిద్ధం చేశారు. తీరా కాంటా ఎప్పుడు ప్రారంభిస్తారని రైతులు అడిగితే రేపుమాపు అంటూ నిర్వాహకులు చెప్పడంతో ఎదురుచూపులు తప్పడంలేదు. 20 రోజులుగా రైతులు ఉదయం, రాత్రి కొనుగోలు కేంద్రం వద్దే పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో వాతావరణంలో ఒక్కోసారి మార్పులు సంభవిస్తున్నాయి. ఎప్పుడు వర్షం కురుస్తుందోనని ఆందోళన చెందుతున్న రైతన్నలు వెంటనే కాంటా ప్రారంభించాలని కోరుతున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రానికే జొన్నను సైతం రైతులు పెద్ద మొత్తంలో తీసుకువచ్చారు. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కొనుగోలు చేస్తామన్న ఆదేశాలు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలు జొన్నలు కొనుగోలు చేస్తుం దా లేదా అనే దానిపై స్పష్టత కరువైంది. వెంటనే జొన్న కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి 20 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ తూకాలు ప్రారంభం కాలేదు. నాకున్న ఆరెకరాల్లో మూడెకరాల్లో జొన్న, మరో మూడెకరాల్లో వరి సాగుచేసిన. వడ్లను తీసుకువచ్చినా ఇప్పటివరకు కాంటా చేయలేదు. జొన్న కొనుగోలు కేంద్రం ఎప్పుడు ప్రారంభిస్తారో ఇప్పటివరకూ స్పష్టత లేదు. ఇప్పటి వరకు గన్నీ బస్తాలు ఇవ్వలేదు.
-దుర్గయ్య, రైతు, సింగీతం
కొనుగోలు కేంద్రానికి 20 రోజుల క్రితం వడ్లను తీసుకువచ్చిన. ఇప్పటి వరకు తూకాల గురించి ఎలాంటి చర్చ లేదు. ప్రతిరోజూ సాయంత్రం అయిందంటే చాలు వర్షం కురుస్తుందేమోనని భయం ఉంటుంది. ఇప్పటికైనా నిర్వాహకులు తూకాలు వెంటనే ప్రారంభించాలి. నిత్యం ఇక్కడే పడిగాపులు కాయాల్సి వస్తున్నది.
-ఆకుల శ్రీనివాస్, రైతు, సింగీతం