హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల నుంచి వెంటనే విద్యుదుత్పత్తిని నిలిపేయాలని తెలంగాణ, ఏపీకి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సూచించింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి, ఏపీ జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి కేఆర్ఎంబీ మెంబర్ (పవర్) ఇటీవల లేఖ రాశారు.
శ్రీశైలం ప్రాజెక్టు ఎండీడీఎల్ 834 అడుగులైతే ప్రస్తుతం 832.80 అడుగుల కన్నా తక్కువగా ఉన్నదని, 53.85 టీఎంసీలు ఉండాల్సి ఉండగా, 52.42 టీఎంసీలే ఉన్నాయని తెలిపారు. అయినా ఇరు రాష్ర్టాలు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి చేయడం తగదని సూచించారు. వేసవిలో తాగు, సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే విద్యుదుత్పత్తిని నిలిపేయాలని సూచించారు. ఇప్పటికే తెలంగాణ విద్యుదుత్పత్తిని నిలిపేయగా, ఏపీ ప్రభుత్వం మాత్రం యథావిధిగా కొనసాగిస్తుండటం గమనార్హం.