మురికి కూపంలా ఉన్న పల్లెలు ప్రగతి పథంలో దూసుకు పోతున్నాయనడానికి కోటగిరి గ్రామం నిదర్శనంగా నిలుస్తున్నది. తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కోటగిరి గ్రామంలోనే రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో గ్రామంలోని ప్రతి గల్లీలో సీసీ రోడ్లు, మురికి కాలువలు పూర్తయ్యాయి. గ్రామం శుభ్రంగా మారి..పచ్చదనంతో కొత్తందాలను సంతరించుకున్నది.
కోటగిరి, ఏప్రిల్ 9 : ఒకప్పుడు మురికికూపంలా ఉన్న పల్లెలు అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్నాయి. సీఎం కేసీఆర్ పుష్కలంగా నిధులు మంజూరు చేయడంతో పల్లెలు ప్రగతి బాట పట్టాయి. ఇప్పుడు ఎటు చూసినా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పచ్చని చెట్లతో పల్లెలు కొత్త అందాలను సంతరించుకున్నాయి. సీఎం కేసీఆర్ సహకారం.. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక కృషితో బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రతి రూపాయినీ సద్వినియోగం చేసుకోవడంతో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం పల్లెలు ప్రగతికి చిరునామాగా నిలుస్తున్నాయి. కోటగిరి గ్రామంలోని ఏ రోడ్డు చూసినా సీసీతో కళకళలాడుతున్నాయి. అవసరం ఉన్న చోట డ్రైనేజీలనూ నిర్మించారు. గ్రామంలోని అన్ని కాలనీల్లో సుమారు రూ.5 కోట్లతో సీసీరోడ్లు, డ్రైనేజీలు పూర్తయ్యాయి. మరో రూ.5 కోట్ల ప్రత్యేక నిధులతో పలు కాలనీల్లో వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేశారు.
ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు..
మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లాలను ఏర్పాటుచేసి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారు. గ్రామంలోని 11 నీటి ట్యాంకులకు రంగులు వేయించారు. కోటగిరిలో గ్రామంలో నీటి సమస్య తలెత్తకుండా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో ముందస్తు చర్యలు తీసుకున్నారు. మిషన్ భగీరథ నీటిని పూర్తి స్థాయిలో అందిస్తున్నారు. సొంతింటి కలనెరవేర్చేందుకు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టి అర్హులైన పేద కుటుంబాలకు పంపిణీ చేశారు.
కాలనీలు మెరుస్తున్నయ్..
గ్రామంలో సీసీ రోడ్లు వేయడంతో కాలనీ లు మెరుస్తున్నయ్. వానకాలంలో బురదతో నడవలేక చాలా కష్టమయ్యేది. రాత్రి వేళల్లో పిల్లలు, ముసలోళ్లు చాలా ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం సీసీ రోడ్లు వేయడంతో కాలనీలు బాగయ్యాయి.
– ఎడ్డెడి రాజయ్య, బొడ్రాయిగల్లీ, కోటగిరి
చాలా సంతోషంగా ఉంది
వర్షాకాలం వస్తే మీదిగల్లీలో నడవడానికి కూడా వీలు ఉండేది కాదు. రోడ్డుపైనే బురద, నీళ్లు నిలిచేవి. ఇటీవల సీసీ రోడ్డు వేయడంతో సమస్య తీరింది. రోడ్డు వేస్తారని కలలో కూడా అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు.
– అమని విఠల్, మీదిగల్లీ, కోటగిరి
స్పీకర్ సహకారంతో అభివృద్ధి
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో కోటగిరి అభివృద్ధి బాటలో పయనిస్తున్నది. ఇప్పటి వరకు సుమారు రూ.10 కోట్లతో పనులు పూర్తయ్యా యి. సకల వసతులతో 34 డబుల్ బెడ్ రూం ఇండ్లను లబ్ధిదారులకు అందించాం. మిగితా 290 మంది సొంత స్థలంలోనే ఇండ్లు కట్టుకున్నారు. వారికి బిల్లులు కూడా పంపిణీ చేశాం. ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు సరఫరా చేస్తున్నాం. పంట పొలాలకు వెళ్లేందుకు స్పీకర్ రోడ్లు వేయించారు. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం హయాంలో సర్పంచ్గా పని చేయడం నా అదృష్టం.
– పత్తి లక్ష్మణ్, సర్పంచ్, కోటగిరి