ఆర్మూర్, మార్చి 2 : ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తున్నది. కార్పొరేట్ దవాఖానలకు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన సేవలను అందిస్తున్నది. పలు దవాఖానల్లో అత్యవసర సేవలను సైతం అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా డయాలసిస్ రోగులకు సమీప దవాఖానల్లో కేంద్రాలను ఏర్పాటుచేసి వారికి ఉపశమనం కలిగించింది.
ఇందులో భాగంగా ఆర్మూర్ వంద పడకల దవాఖానలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయగా.. జనవరి 5న స్థానిక ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రారంభించారు. ప్రారంభించిన నెలరోజుల వ్యవధిలో 381 మంది డయాలసిస్ రోగులకు సేవలు అందించడం గమనార్హం.
ప్రతిరోజూ 15మందికి డయాలసిస్
ప్రస్తుతం కేంద్రంలో 32 మంది చికిత్స పొందుతున్నారు. డయాలసిస్ రోగికి వారంలో రెండు నుంచి మూడు సార్లు రక్తం శుద్ధి చేస్తున్నారు. ఒక్కో రోగికి ఒకసారి డయాలసిస్కు నాలుగు గంటల సమయం తీసుకుంటున్నారు. దవాఖానలో మొత్తం ఐదు మిషన్లను ఏర్పాటు చేయగా..ప్రతిరోజూ ఉదయం 7 నుంచి రాత్రి 8గంటల వరకు మూడు షిప్ట్ల్లో డయాలసిస్ రోగులకు సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ కేంద్రం వరంలా మారింది.
స్థానికులకు వరంలా..
ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో స్థానికంగా ఉన్న రోగులకు ఎంతో ఉపయోగకరంగా మారింది.గతంలో నిజామాబాద్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. వ్యయప్రయాసలతో వెళ్లి డయాలసిస్ చేయించుకున్న రోగులు ఇప్పుడు ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానలోనే వైద్యసేవలను పొందుతున్నారు.ఆర్మూర్తో పాటు బాల్కొండ, మెట్పల్లి ప్రాంతాల నుంచి కూడా వ్యాధిగ్రస్తులు ఆర్మూర్కు వచ్చి డయాలసిస్ చేయించుకుంటున్నారు. డయాలసిస్ రోగులకు బస్సుపాస్ సౌకర్యంతో పాటు రూ. రెండు వేల పింఛన్, ఉచిత భోజనం అందజేస్తున్నారు. అదే ప్రైవేట్ దవాఖానలో అయితే ఒక్కసారి డయాలసిస్ చేస్తే రూ.4,500 చార్జి ఉంటుంది. ఇక్కడ రోగికి ఉచితంగా డయాలసిస్ చేస్తూ ప్రభుత్వం రూ.1800 చెల్లిస్తున్నది. ఏజెన్సీకి రూ.1500, దవాఖాన నిర్వహణకు రూ. 300 వినియోగిస్తామని డయాలసిస్ కేంద్రం ఇన్చార్జి తెలిపారు.
రూ. 5 లక్షల ఖర్చు అయ్యింది..
మూడేండ్ల నుంచి నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో డయాలసిస్ చేయించుకుంటున్నాను. ఇప్పటి వరకు 5లక్షల రూపాయలు ఖర్చుచేశాను. ప్రస్తుతం ఆర్మూర్ దవాఖానలో డయాలసిస్ కేంద్రం కావడంతో ఇక్కడికే వస్తున్నా. ఇక్కడ ఉచితంగా డయాలసిస్ చేస్తూ బస్సు పాస్ కూడా ఇచ్చారు. ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేశారు. కేసీఆర్ పాలనలో పేదలకు వైద్యం అందుబాటులోకి వచ్చింది.
– జ్యోతి, ఎర్రాపూర్, కమ్మర్పల్లి
వ్యయ, దూరభారం తగ్గింది.
మొదట హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో డయాలసిస్ కోసం రూ. 2లక్షలు ఖర్చు చేసిన. తర్వాత నిజామాబాద్లో డయాలసిస్ చేయించుకున్న. ఆర్మూర్లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు కావడంతో దూరం తగ్గింది. ఆర్మూర్లోనే డయాలసిస్ చేయించుకుంటున్న. ఇప్పటికి 16 సార్లు డయాలసిస్ చేశారు. రూ. 2,016 పింఛన్, బస్సు పాస్ సౌకర్యంతో పాటు భోజనం పెడుతున్నారు. డయాలసిస్ కేంద్రాన్ని ఆర్మూర్లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జీవన్రెడ్డికి ధన్యవాదాలు.
– నారాయణ, మచ్చర్ల