కమ్మర్పల్లి, ఫిబ్రవరి 4: జిల్లా కేంద్రంలోని మాలపల్లికి చెందిన బాలుడి కిడ్నాప్ ఘటన మరువకముందే అలాంటి ఘటనే ఆర్మూర్లో చోటు చేసుకున్నది. ఆర్మూర్ బస్టాండ్లో ఓ మహిళ బాలుడిని అపహరించేందుకు యత్నించగా.. గుర్తించిన ప్రయాణికులు సదరు బాలుడితోపాటు మహిళను కమ్మర్పల్లి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకోగా.. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మెండోరా మండల కేంద్రానికి చెందిన జిల్లపల్లి గంగారాం (లైన్మన్) ఆదివారం ఉదయం తన భార్య తిరుమల, కుమారుడు గగన్ సిద్ధార్థ్ తేజ్(7)తో కలిసి ఆర్మూర్ మండలం దేగాం గ్రామానికి వెళ్లారు. సాయంత్రం ఆర్మూర్ బస్టాండ్కు చేరుకొని బడాభీమ్గల్కు వెళ్లే బస్సును ఎక్కారు. బస్సులో తమ కుమారుడు సిద్ధార్థ్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెంటనే బస్సు దిగి బస్టాండ్లో వెతికారు. కనిపించకపోవడంతో ఆర్మూర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బోధన్ మండలం సాలూరాకు చెందిన సావిత్రి అనే మహిళ గగన్ సిద్ధార్థ్ తేజ్ను తీసుకొని మెట్పల్లి వెళ్లే బస్సు ఎక్కింది. మార్గమధ్యంలో బాలుడు ఏడుస్తుండడంతో ప్రయాణికులు నిలదీయగా తమ బంధువుల పిల్లవాడు అని సావిత్రి నమ్మించింది. బస్సు మోర్తాడ్ దాటిన తర్వాత బాలుడు గట్టిగా ఏడుస్తూ ఆమె ఎవరో తెలియదని చెప్పడంతో మోస్రా మండలం చింతకుంటకు చెందిన ప్రయాణికులు సాయిశశిధర్రెడ్డి, మెట్పల్లికి చెందిన సాయికుమార్ బస్సును కమ్మర్పల్లి పోలీస్స్టేషన్ వద్ద నిలిపివేయించారు. సావిత్రితోపాటు బాలుడిని పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకొన్న బాలుడి తల్లిదండ్రులు వెంటనే కమ్మర్పల్లికి చేరుకొన్నారు. బాలుడిని తల్లి తిరుమలకు కమ్మర్పల్లి ఎస్సై రాజశేఖర్ అప్పగించారు. బాలుడిని అపహరించేందుకు యత్నించిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.