నిజామాబాద్, డిసెంబర్ 15, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పదో విడుత రైతుబంధు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేసిన దరిమిలా వ్యవసాయ శాఖ ఏర్పాట్లలో మునిగి తేలుతున్నది. గత సీజన్లో అర్హుల సంఖ్యతో పాటు యాసంగి నాటికి కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలను పొందిన వారి వివరాలను క్రోడీకరించి రాష్ట్ర స్థాయికి పంపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికగా కొలుస్తున్న రైతుబంధు పథకం ప్రతి రైతుకు లాభం చేస్తున్నది. రైతుకు పైసలిచ్చి సాగుకు ప్రోత్సాహం అందించిన ఏకైక ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టిస్తున్నది. దేశ వ్యాప్తంగా ఈ పథకానికి భారీ క్రేజ్ ఏర్పడడంతో చాలా మంది కేసీఆర్ తెచ్చిన స్కీమ్ను కాపీ కొడుతున్నారు. దిగ్విజయంగా అమలవుతున్న రైతుబంధు ద్వారా అనేక మంది కర్షకుల కష్టాలకు చెల్లుచీటి పడుతున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతుబంధు ద్వారా ఈ యాసంగి సీజన్లో సుమారు 5లక్షల 30వేల మందికి లాభం జరిగే వీలుంది. వీరందరికీ ఎకరానికి రూ.5వేలు చొప్పున రూ.500 కోట్లకు పైగానే నిధులు ఖర్చు కానున్నది. కేవలం పట్టాదారు పాస్బుక్కులు కలిగి ఉన్న వారందరికీ పెట్టుబడి సాయం దక్కుతుంది.
క్రోడీకరించిన వివరాలు…
2022 వానకాలంలో నిజామాబాద్ జిల్లాలో 2,54,155 మంది రైతుల కోసం రూ.265.45 కోట్లు నిధులు వెచ్చించారు. కామారెడ్డి జిల్లాలో 2,71,613 మంది రైతులకు రూ.259.86 కోట్లు వెచ్చించారు. ఈసారి కూడా ఇంచుమించుగా యాసంగికి ఇదే ప్రాతిపదికన నిధులు విడుదలవుతాయి. పట్టాదారు పాసుపుస్తకాల్లో పేర్ల మా ర్పులు, ఆస్తి బదలాయింపు వంటి చర్యలతో లబ్ధిదారుల సంఖ్య, మంజూరయ్యే నిధుల్లో స్వల్పంగా తేడాలుండనున్నాయి. 2018లో రైతుబంధు పథకాన్ని తీసుకు వచ్చారు. ఏటా రెండు సీజన్లలో కలిపి ఎకరానికి రూ.10వేలు సాయం రైతుకు చేరుతున్నది. ప్రపంచంలో రైతులకు ప్రభుత్వమే పెట్టుబడి ఇచ్చి పంటలు సాగు చేసే విధంగా ప్రోత్సహించే పద్ధతి ఎక్కడా లేదు. ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయ శాఖ అధికారులు వివరాలను రాష్ట్ర కార్యాలయానికి క్రోడీకరించి పంపించారు. ధరణి పోర్టల్ సమాచారం ఆధారంగా ఈ వివరాలను సేకరించారు. చిన్న కమతాల నుంచి పెద్ద కమతాల వరకు గతం మాదిరిగానే రైతుబంధు నిధుల జమ అన్నది చకచకా జరుగుతున్నది. నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలోనే డిపాజిట్ అవుతుంది.
అప్పుల నుంచి విముక్తి…
వ్యవసాయ రంగం ఇప్పుడు సంక్షోభం నుంచి బయట పడడంతో రైతుల్లో సంతోషం కనిపిస్తోంది. కొన్నేండ్లుగా తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయాలతో కర్షకులకు రుణ విముక్తి కలుగుతున్నది. గతంలో సాగు కాలం వస్తే రైతులకు తిప్పలు తప్పేవి కావు. పెట్టుబడికి చిల్లి గవ్వ లేక నానా తంటాలు పడేది. గత సీజన్ పంటంతా వడ్డీలకు, అప్పుల చెల్లింపులకే సరిపోయేది. చాలీచాలని లాభాలు కాస్త కుటుంబ పోషణకు సరిపోగా తదుపరి పంట పెట్టుబడి పెట్టేందుకు మాత్రం పైసల్ మిగిలేది కాదు. దీంతో దిక్కులేక రైతులు గ్రామంలో పెద్దల వద్ద మోకరిల్లాల్సి వచ్చేది. రూ.2 నుంచి రూ.4కు వడ్డీ తీసుకుని రుణ బందీలుగా మారి సతమతం అయ్యేది. తీరా చేసేది లేక రుణ విముక్తి కోసం ప్రాణాలు తీసుకొనే గడ్డు పరిస్థితులు గత పాలకుల సమయంలో కోకొల్లలుగా వెలుగు చూశాయి. ఇలాంటి గడ్డు పరిస్థితికి సీఎం కేసీఆర్ తీసుకు వచ్చిన సంస్కరణలతో అడ్డుకట్ట పడింది. సాగు సంబురంలా మారడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పాలిట దేవుడిగా మారారు. రైతుబంధు పథకంతో కర్షకుల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపుతుండడంతో రెట్టించిన ఉత్సాహంతో కర్షక లోకం సాగుబాట పడుతున్నది.