తెలంగాణలో వైద్య విప్లవం మొదలైంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం జిల్లాకో మెడికల్ కళాశాల వచ్చింది. వైద్యవిద్య చదవాలన్న నిరుపేదల కల సాకారమైంది. గతంలో మెడికల్ సీటు అంటే డబ్బు ఉన్నోళ్లకే సొంతం. కోట్లుంటేనే తెల్లకోటు వేసుకునే పరిస్థితి ఉండేది. పేదింటి బిడ్డలకు వైద్యవిద్య కలగానే మిగిలిపోయేది. కానీ తెలంగాణ వచ్చాక పరిస్థితి మారిపోయింది. పేదింటి బిడ్డలకు మెడికల్ సీట్లు, పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే కామారెడ్డిలో ఏర్పాటైన వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. సీఎం కేసీఆర్ నేడు వర్చువల్ విధానంలో ఈ కాలేజీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. పెద్ద చదువులు చదవాలన్న కల సాకారం అవుతుండడంతో నిరుపేద పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు సంబురపడుతున్నారు. కేసీఆర్తోనే తమ బిడ్డలకు డాక్టర్ అయ్యే అవకాశం దక్కిందని మురిసిపోతున్నారు.
“కామారెడ్డి జిల్లా అయితదని అంతా అనుకున్నరు. ఎప్పటి నుంచో ఈ ప్రాంత బిడ్డల కోరికను తెలంగాణ వచ్చినంకనే మనమే నెరవేర్చుకున్నాం. జిల్లా ఘనంగా ఏర్పాటైంది. ఇప్పుడు పరిపాలనకు కొత్త బిల్డింగ్లు ఆవిష్కృతమైనాయి. త్వరలో మెడికల్ కాలేజీ కూడా కామారెడ్డి గడ్డకు వస్తది. తప్పక ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజీ అవసరం కూడా ఉన్నది. జాతీయ రహదారి, రైల్వే కనెక్టివిటీ ఉన్న కామారెడ్డి ప్రాంతానికి భవిష్యత్తులో అద్భుతంగా ఎదిగే వీలు కూడా ఉండబోతోంది. వచ్చే ఏడాది మంజూరు చేయబోయే మెడికల్ కాలేజీల్లో కామారెడ్డి జిల్లానే ఫస్ట్ ఉంటది. వందశాతం చెబుతున్నా మీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ను కూడా ఈ వేదిక నుంచే కోరుతున్న… మెడికల్ కాలేజీ కోసం మంచి స్థలాన్ని చూసి పెట్టండి. వచ్చే ఏడాది మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసుకుందాం…” అంటూ 2021లో సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే కామారెడ్డి మెడికల్ కాలేజీ ఆవిష్కృతమైంది. 2023-24 విద్యా సంవత్సరంలో వైద్యవిద్యను అందిచేందుకు ఈ గడ్డ సిద్ధమైంది. సీఎం హామీతో రెండేండ్లుగా చకచకా ఏర్పాట్లు జరుగగా… నేడు వర్చువల్ విధానంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కామారెడ్డి ప్రజల చిరకాల వాంఛ అయిన మెడికల్ కళాశాల ప్రారంభం కానున్నది.
ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కామారెడ్డి జిల్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తున్నది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలతో దగ్గరి అనుబంధం ఈ జిల్లాకు సొంతం. నూతన జిల్లాల పరంగా భౌగోళికంగా రాజన్న సిరిసిల్లా, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాలతో కామారెడ్డి సరిహద్దును కలిగి ఉన్నది. మరోవైపు అంతర్రాష్ట్ర సరిహద్దు కూడా కర్ణాటక, మహారాష్ట్ర్ర్టలతో పంచుకుంటోంది. ఈ ప్రాంత ప్రజలకు పొరుగు రాష్ర్టాలతోపాటు ఉత్తర తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలతోనూ అనుబంధం ఉన్నది. దశాబ్దాలుగా రాకపోకలు, వ్యాపార, వాణిజ్య అవసరాల మేరకు కార్యకలాపాల నిర్వహణ ఊహకు అందనంత వేగంగా వ్యాప్తి జరుగుతున్నది. హైదరాబాద్కు దగ్గర్లో ఉండడంతోనూ ఇప్పటికే మెడికల్ ఏజెన్సీలు, మెడికల్ ఉపకరణాల సరఫరాకు కామారెడ్డి హబ్గా మారింది. ఇక్కడి నుంచే ఉత్తర తెలంగాణకు ఔషధాలు, ఇతరత్రా మెడికల్ ఉత్పత్తుల సరఫరా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో అదనపు హంగులు సంతరించుకోనున్నాయన్న అంచనాలు నిజమయ్యాయి. విద్యాపరంగా మిగిలిన జిల్లాలతో అత్యుత్తమ అవకాశాలు అందిపుచ్చుకుంటున్న కామారెడ్డి వాసులకు వైద్యకళాశాల రాకతో ఊహించని లబ్ధి జరగడం ఖాయంగా కనిపిస్తున్నది.
గతంలో ఎక్కువ మంది ఎంసెట్ రాసేవాళ్లం, సీట్లు తక్కువ ఉండేవి. సీఎం కేసీఆర్ మాలాంటి వారి కోసం జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడంతో రెండో ప్రయత్నంలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. అందులోనూ తనది హైదరాబాద్ కావడంతో ఎక్కువ దూరం కాకుండా తక్కువ దూరంలోనే ఎంబీబీఎస్ సీటు లభించడం చాలా సంతోషంగా ఉన్నది.
– ఎఫ్.స్నేహ, హైదరాబాద్
కామారెడ్డి,సెప్టెంబర్ 14 : కామారెడ్డి జిల్లా వైద్య కళాశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. నేడు శుక్రవారం వర్చువల్ విధానంలో సీఎం కేసీఆర్ కళాశాలను ప్రారంభించనున్నారు. కామారెడ్డిలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి,మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంత్ షిండే, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్ పాల్గొననున్నారు. ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య వర్చువల్గాలో సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం సుమారు 15 వేల నుంచి 20వేల మందితో నిజాంసాగర్ చౌరస్తా నుంచి ఏరియా దవాఖాన, జేపీఎన్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు.
మెడికల్ కాలేజీ ఏర్పాటు కావాలంటే అదో పెద్ద ప్రాసెస్. 300 పడకలతో కూడిన వైద్యశాల ఉంటేనే వైద్య కళాశాలకు అనుమతి దక్కుతుంది. అంటే మెడికల్ కాలేజీ ఏర్పాటుతో కామారెడ్డికి 300 పడకలతో కూడిన ప్రభుత్వ దవాఖాన ఏర్పాటు అవుతుంది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న ఏరియా దవాఖానలో తక్కువ సామర్థ్యమే ఉన్నది. జాతీయ రహదారి పక్కనే ఉండడంతో క్షతగాత్రుల రాక ఎక్కువగా ఉంటుంది. క్రిటికల్ కేసులు నేరుగా హైదరాబాద్కు పంపించే పరిస్థితి ఉంటుంది. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో ఈ ప్రాంతవాసులు మెరుగైన వైద్యం కోసం రాజధానికి పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు. వైద్య కళాశాలతో పరిశోధనలు, శస్త్ర చికిత్సలు, అన్ని రకాల వేద్య సేవలు ఒకే గొడుగు కిందికి వస్తాయి. వైద్య విద్యను అభ్యసించే ఔత్సాహికులకు కామారెడ్డి ప్రాంతం చేరువగా నిలుస్తుంది. దీంతో ఉత్తర తెలంగాణలోని కీలకమైన జిల్లాల్లోని యువత కామారెడ్డికి వచ్చి వైద్య విద్యను అభ్యసించడం కూడా పెద్ద భారమేమి ఉండకపోవచ్చు. ఇలా మెడికల్ కాలేజీతో వైద్య విద్య వ్యాప్తితోపాటు వైద్య భరోసా కూడా ఇక్కడి ప్రజలకు దక్కుతుంది.
నూతన జిల్లా ఏర్పాటుతో కామారెడ్డి ప్రాంతం కొంగొత్త బాటలో పయనిస్తున్నది. అభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. రాష్ట్ర రాజధానితో కనెక్టివిటీ ఉండడం, 90 కిలోమీటర్ల దూరంలోనే ఔటర్ రింగ్ రోడ్డును టచ్ చేస్తుండడంతో కామారెడ్డికి అనేక అనుకూలతలు ఏర్పడ్డాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో కామారెడ్డి జిల్లా రూపురేఖలు రోజురోజుకూ మారుతున్నాయి. తాజాగా మెడికల్ కాలేజీ ఏర్పాటుతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి వైద్యపరంగానూ అదనపు హంగులు చేరబోతుండడం సంతోషకరమైన విషయం. వైద్య కళాశాలతో ఈ ప్రాంత పేద, మధ్యతరగతి ప్రజలకు కొండంత అండ దొరకనున్నది.
– గంప గోవర్ధన్, ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే
కామారెడ్డి మెడికల్ కళాశాలకు వంద మెడికల్ సీట్లను కేటాయించారు. ఇందులో ఇప్పటికే 72 సీట్లు భర్తీ అయ్యాయి. ఆలిండియా కోటాలో 15 సీట్లు కేటాయించగా 10 సీట్లు భర్తీచేశారు. రాష్ట్ర కోటాలో 85 సీట్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 62మంది అడ్మిషన్లు తీసుకున్నారు. మిగిలిన సీట్లలోనూ ఔత్సాహిక వైద్య విద్యార్థులు చేరబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం వారికి కామారెడ్డి మెడికల్ కాలేజీ ఎంతో అనుకూలంగా ఉండబోతున్నది. హైదరాబాద్కు 2గంటల ప్రయాణ దూరంతోపాటు జాతీయ రహదారి 44 కనెక్టివిటీ ఉండడం, రైల్వేస్టేషన్ కూడా కూతవేటు దూరంలోనే నెలకొనడంతో అనేక రైళ్లలోనూ కామారెడ్డికి చేరుకునే వీలున్నది. కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక భాగంలో దేవునిపల్లిలో ఇదివరకు నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మెడికల్ కాలేజీగా రూపాంతరం చేశారు. అదనపు నిధులను వెచ్చించి మెడికల్ కాలేజీ కోసం నిర్మాణాలు చేపట్టారు. 2023-24 విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 75మంది సిబ్బంది నియామకం సైతం పూర్తయ్యింది. 10 మంది ప్రొఫెసర్లు, 27మంది అసిస్టెంట్ ప్రొపెసర్లు, ఐదుగురు సీనియర్ రెసిడెంట్, ఐదుగురు హౌస్ సర్జన్లు సైతం అందుబాటులో ఉన్నారు. మరో 20 మంది సీనియర్ రెసిడెంట్లతోపాటు వైద్యకళాశాలలో మంజూరైన పోస్టుల మేరకు సిబ్బంది రాబోతున్నారు.