కామారెడ్డి, అక్టోబర్ 26 : కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారని, దీంతో ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అరచేతితో సూర్య కిరణాలు ఆపలేము అన్న చందంగా కామారెడ్డి నుంచి కేసీఆర్ విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. కేసీఆర్ను లక్షకుపైగా మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భిక్కనూర్ మండలం భాగిర్తిపల్లి, మాచారెడ్డి మండలం అక్కాపూర్, కొత్తపల్లి, సోమార్పేట్, దోమకొండ మండలం అంబారిపేట్, రామారెడ్డి మండలం అన్నారం గ్రామాలకు చెందిన నాలుగువందల మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ..ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో, విలేకరులతో స్పీకర్ మాట్లాడుతూ..కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నందున ఇక్కడి ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే ఉన్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో సాధ్యం కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ పాలన గాడి తప్పిందన్నారు. దక్షిణ భారతదేశంలో పుష్కలంగా పంటలు పండే రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. యాసంగిలో రైతులకు రైతు బంధు ఇవ్వొద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం రైతువ్యతిరేక చర్య అని పేర్కొన్నారు. దేశంలోని 24 రాష్ర్టాల్లో పాలిస్తున్న కాంగ్రెస్, బీజేపీలు.. మన రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి, సంక్షేమం పథకాలను అమలుచేసి చూపించి మాట్లాడాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని పక్క రాష్ర్టాలు గుర్తించి ప్రశంసిస్తున్నాయని తెలిపారు.
కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఒక వైపు కొనసాగిస్తూ.. దానికి సమాంతరంగా సంక్షేమ రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దుర్భిక్షం నుంచి సుభిక్షం వైపు వెళ్తుందని అన్నారు. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు వెళ్తుందని అన్నారు.
రైతుబంధును బంద్ చేయాలని కాంగ్రెస్ నాయకులు కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశారని గుర్తుచేశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ నాయకులకు రైతులపై ఎంత కోపం ఉందో ఇదొక్క ఉదాహరణ చాలన్నారు. రైతులు బాగుపడితే కాంగ్రెస్ పార్టీ చూడలేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులు దొరకడం లేదని అన్నారు. బీజేపీకి పదికి మించి స్థానాలు రావన్నారు. కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలను ఇస్తున్నదని, రెండు డిజిట్ల కన్నా ఎక్కువ సీట్లు రావని సెంట్రల్ ఇంటలిజెన్స్ రిపోర్టు చెబుతుందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు బొర్లపడి దండాలు పెట్టినా ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. రైతులు, ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయడం ఇక్కడి ప్రజల అదృష్టమని అన్నారు. ప్రతి పక్షనాయకుల దిమ్మతిగిగే విధంగా కేసీఆర్కు భారీ మెజార్టీ వస్తుందని అన్నారు. రైతు బంధు బంద్ చేయాలని చెబుతున్న కాంగ్రెస్ నాయకులకు ఓటు బందు చేయాలని సూచించారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధిని తెలంగాణలో సీఎం కేసీఆర్ మాత్రమే చేశాడని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు. చాలా మంది కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ తిరుమలరెడ్డి, రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్,మాచారెడ్డి , రామారెడ్డి ఎంపీపీలు లోయపల్లి నర్సింగరావు, దశరథ్ రెడ్డి,కామారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుంబాల రవి యాదవ్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.