తల్లీబిడ్డల సంరక్షణ కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ ఆడబిడ్డలకు వరంగా మారింది. మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు పౌష్టికాహార లోపంతో పాటు రక్తహీనతతో బాధ పడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. వారికి ఆరోగ్య భరోసా కల్పించేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను తీసుకొచ్చింది. గతేడాది డిసెంబర్ 21న కామారెడ్డి జిల్లా గడ్డ మీద ఈ విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం కిట్ల పంపిణీ విజయవంతంగా కొనసాగుతున్నది. జిల్లాలో ఇప్పటివరకు 7,721 మందికి కిట్లను పంపిణీ చేశారు. ప్రొటీన్లు, విటమిన్లు అందించే న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, ఖర్జూరా, నెయ్యి, ఐరన్ సిరప్ బాటిల్స్, అల్బెండజోల్ మాత్రలతో కూడిన ఈ కిట్లతో గర్భిణులు, బాలింతల సంపూర్ణ ఆరోగ్యానికి భరోసా లభించింది.
ఎల్లారెడ్డి రూరల్, ఏప్రిల్ 27 : మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వ దవాఖానల్లో ఇస్తున్న కేసీఆర్ కిట్ ప్రాధాన్యతను సంతరించుకోవడంతో అదే స్ఫూర్తితో గర్భిణుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పౌష్టికాహార (న్యూట్రిషిన్) కిట్ అందిస్తున్నది. రక్తహీనత సమస్యతో గర్భిణులు, బాలింతలు సతమతమవుతున్నారు. 70శాతానికి పైగా పౌష్టికాహార లోపమే ఇందుకు కారణమని ప్రభుత్వం గుర్తించింది. అందుకే మహిళలు గర్భం దాల్చగానే న్యూట్రిషిన్ కిట్లను అందించి పండంటి బిడ్డకు జన్మనిచ్చేలా చర్యలు చేపట్టింది. కామారెడ్డి జిల్లాలో గత ఏడాది డిసెంబర్లో పథకాన్ని ప్రారంభించగా 14,500 మందిని గుర్తించి, ఇప్పటివరకు 7,721 మందికి కిట్లను పంపిణీ చేశారు.
మాతాశిశు మరణాలను అరికట్టేందుకు..
రాష్ట్రంలోని మారుమూల జిల్లాలతో పాటు గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం న్యూట్రిషిన్ కిట్లను అందిస్తున్నది. రక్తహీనత లోపం కారణంగా తల్లి, బిడ్డ అనారోగ్యానికి గురికావడంతో పాటు ప్రసూతి మరణాలకు దారితీస్తున్నది. గర్భస్రావం, నెలలు నిండకుండా, తక్కువ బరువుతో శిశువులు జన్మించడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నింటిని గుర్తించిన ప్రభుత్వం పౌష్టికాహారం కిట్లు అందజేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 14,500 మంది మహిళల్లో రక్తహీనత ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
రెండు విడుతలుగా పంపిణీ
ప్రతీ గర్భిణికి 5, 9వ నెలల్లో రెండు విడుతలుగా న్యూట్రిషిన్ కిట్లను అందజేస్తున్నది. దాదాపుగా రెండువేల రూపాయల విలువ గల ఈ కిట్లో న్యూట్రిషిన్ మిక్స్ పౌడర్ 2 కిలోలు, కిలో ఖర్జూరాలు, 3 ఐరన్ సిరప్ సీసాలు, ప్లాస్టిక్బుట్ట, 500గ్రాముల నెయ్యి, సంచి, ఒక కప్పు, అల్బెండజోల్ మాత్రలు ఉన్నాయి. ఇప్పటి వరకు 7,721 మందికి పైగా కిట్లను పంపిణీ అందజేశారు. అంతేకాకుండా గర్భిణులు, బాలింతలకు పలు సూచనలు చేస్తున్నారు.
న్యూట్రిషిన్ కిట్ చాలా ఉపయోగంగా ఉంది
రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన న్యూట్రిషిన్ కిట్ చాలా బాగున్నది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా. కిట్లో ఉన్న వస్తువులు తినడంతో నా ఆరోగ్యం ఎంతో మెరుగుపడింది. ఇప్పటివరకు ఉన్న రక్తహీనత, బలహీనత తగ్గిపోయింది. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా పెరిగేందుకు ప్రభుత్వం అందించిన కిట్ ఎంతో ఉపయోగకరంగా ఉన్నది.
– రజిత, మల్కాపూర్
గర్భిణుల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం అందించిన న్యూట్రిషన్ కిట్లను గర్భిణులకు అందజేస్తున్నాం. రక్తహీనతను తగ్గించడం, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి ఇవి ఎంతో ఉపయోగకరంగా మారాయి. గర్భిణులకు ఆరోగ్య సమస్యలు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ కిట్లను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతులుగా మారాలి.
– రవీంద్రమోహన్, ఎల్లారెడ్డి దవాఖాన సూపరింటెండెంట్