మోర్తాడ్, జూన్ 2: ఎన్నో పోరాటాలు, మరెందరో బలిదానాలు, అమరుల త్యాగాలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని, ఇక్కడి అస్తిత్వాన్ని కనుమరుగు చేయడానికి కొన్ని శక్తులు మళ్లీ కుట్రలు పన్నుతున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ ఉనికి ప్రశ్నార్థకం అవుతున్న వేళ, ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలని సూచించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తిని తీసుకుని ఉనికిని కాపాడుకోవడానికి అవసరమైతే మరొక తెలంగాణ ఉద్యమానికి ప్రతి బిడ్డా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బా ల్కొండలోని క్యాంపు కార్యాలయంలో జాతీయజెండా ఎగురవేసిన అనంతరం వేముల మాట్లాడారు.
2001లో కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఒంటిచేత్తో, ఒక్కరిగానే బయల్దేరారని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సూచించిన విధంగా…సమీకరించు, బోధించు, పోరాడు అనే సిద్ధాంతాన్ని ఆకళింపు చేసుకుని 14 ఏండ్ల పాటు అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. ఎలాంటి హింసకు తావులేకుండా కేవలం ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారానే ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని గెలిపించి, పార్లమెంట్ ద్వారా తెలంగాణను సాధించి పెట్టారని స్పష్టం చేశారు. తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ పదేండ్ల పాలనలో ఊహించని సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని కొనియాడారు.
2009లో కేసీఆర్ చావోరేవో తేల్చుకునేలా 11రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేసి, తెలంగాణ అగ్నిగుండంలా మారితేనే సోనియాగాంధీ ప్రకటన చేశారని, కానీ మళ్లీ ఆంధ్రావాళ్లు బెదరగొట్టగానే వెనక్కి తగ్గారని గుర్తు చేశారు. మాట ఇచ్చి వెనక్కి తగ్గడంతో వేలాది మంది తెలంగాణ బిడ్డలు నిరాశతో ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ చావులకు కాంగ్రెస్, సోనియాగాంధీలే కారణమని స్పష్టం చేశారు. నాడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు సోనియాగాంధీని వేయిమంది బిడ్డలను బలిగొన్న బలిదేవత అన్న ఇదే రేవంత్రెడ్డి, ఇవాళ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందని మాయమాటలు చెబుతున్నారని ఇందులో ఏది నిజమో ఆయనే సమాధానం చెప్పాలన్నారు. ఇవాళ అధికారంలో ఉన్న పెద్దలకు తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేదని, అందుకే వారికి తెలంగాణపై సోయి లేదన్నారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతుబంధును నాట్లప్పుడు కాకుండా ఓట్లప్పుడు ఇవ్వాలని చూస్తున్నదని మండిపడ్డారు. ఓట్లు ఉంటే రైతుబంధు..లేకుంటే నో రైతుబంధు అన్న చందంగా మార్చారని, రైతుబీమాను పక్కన పడేసి ఏదో కుటుంబ బీమా అంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నరసింహులు ఆం ధ్రాకు వెళ్లి చంద్రబాబు ఎదుట మహానాడు సభలో డిక్షనరీలో తెలంగాణ అనే పదమేలేదని మాట్లాడడంపై వేముల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ వాడై ఉండి ఇక్కడి పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ.. తెలంగాణ పదం లేదంటుంటే …ఇక్కడి సీఎం రేవంత్రెడ్డి ఎందుకు ఆ మాటలను ఖండించలేదని ప్రశ్నించారు. కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ సైతం ఎందుకు నిలదీయలేదని అన్నారు.