భీమ్గల్, నవంబర్ 22 : మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ నింబాచలంపై లక్ష్మీనారసింహుని కల్యాణంఅంగరంగ వైభవంగా సాగింది. ఈ నెల 18న ప్రారంభమైన వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కల్యాణ మహోత్సవాన్ని ఆలయ పండితులు కన్నుల పండువగా జరిపించారు. ఆలయ ధర్మకర్త నంబి లింబాద్రి ఆధ్వర్యంలో వేదపఠనం, నంబి పార్థసారథి, విజయ్సారథి, వాసుదేవాచార్యులు,విష్ణు వేదమంత్రోచ్ఛరణలతో కల్యాణ వేడుక ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. స్వామి వారి కల్యాణం తిలకించేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. గర్భాలయంలో స్వామివారి మూల విరాట్కు ఆలయ అర్చకులు శాస్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఉత్సవ విగ్రహాలను బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి మంగళవాయిద్యాలతో గర్భాలయం నుంచి పూల పల్లకీలో స్వామివారి కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. ఉత్తరాదిమఠ పీఠాధిపతి 1008 సత్యాత్మ తీర్థస్వామి వారు స్వామి వారికి బహూకరించిన బంగారు తొడుగు గల శంఖంతో అభిషేక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలతో కన్యాదానం చేశారు. వేడుకలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సతీమణి నీరజా రెడ్డి వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు కన్నే ప్రేమలత- సురేందర్, కౌన్సిలర్లు , వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీఐ వెంకటేశ్వర్లు అధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.