స్వాతంత్య్ర వజ్రోత్సవ కానుకగా 57 ఏండ్లు ఉన్న వారికి ఆసరా పింఛన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ శనివారం హైదరాబాద్లో ప్రకటించారు. అంతే కాకుండా డయాలసిస్ పేషెంట్లకు కూడా అందరిలాగే నెలకు రూ. 2,016 అందించాలని నిర్ణయించారు. ఈ నెల 15 నుంచి వీరికి పెన్షన్లు అందించనుండగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే సిద్ధంగా ఉన్న లబ్ధిదారుల జాబితాపై గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా, సీఎం ప్రకటనపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి, సంబురాలు జరుపుకొన్నారు.
కరీంనగర్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : వయో వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస్తూ కొండంత అండగా నిలుస్తోంది. ఇప్పటి వరకు 65 ఏండ్లు నిండిన వృద్ధులకు మాత్రమే ఆసరా పింఛన్లు అందిస్తున్నారు. గత ఎన్నికల్లో 57 ఏండ్లకు ఈ నిబంధనలను కుదిస్త్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 57 ఏండ్లు నిండిన వారిని ఎంపిక చేసే బాధ్యతను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ చేపట్టింది. అప్పట్లోనే ఈ జాబితాను అధికారులు సిద్ధం చేశారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఇప్పుడు వీరికి పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 57 ఏండ్లు నిండిన వారు 61,110 మంది ఉన్నారు. ఇందులో పింఛన్లు పొందేందుకు 14,494 మంది అర్హులని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కాగా, వీరికి ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లతో పాటు బార్ కోడ్తో ఉన్న కొత్త కార్డులు పంపిణీ చేస్తారు. ఇది వరకు పింఛన్లు పొందుతున్న వారికి కూడా బార్కోడ్తో ఉన్న కొత్త కార్డులు జారీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
మండలాల వారీగా అర్హుల జాబితా
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు సిద్ధం చేసిన జాబితా ప్రకారం మండలాల వారీగా లబ్ధిదారుల వివరాలు ఇలా ఉన్నాయి. చిగురుమామిడిలో 624, చొప్పదండి మండలంలో 806, చొప్పదండి మున్సిపాలిటీలో 493, ఇల్లందకుంటలో 275, గంగాధరలో 1,133, గన్నేరువరంలో 469, హుజూరాబాద్ మండలంలో 422, హుజూరాబాద్ మున్సిపాలిటీలో 91, జమ్మికుంట మండలంలో 415, జమ్మికుంట మున్సిపాలిటీలో 757, కరీంనగర్ రూరల్లో 1,182, కరీంనగర్ నగర పాలక సంస్థలో 1,180, కొత్తపల్లి మండలంలో 906, కొత్తపల్లి మున్సిపాలిటీలో 171, మానకొండూర్లో 1,287, రామడుగులో 1,230, సైదాపూర్లో 388, శంకరపట్నంలో 707, తిమ్మాపూర్లో 1,179, వీణవంకలో 779 చొప్పున మొత్తం 14,494 మంది అర్హులుగా ఉన్నట్లు తెలుస్తోంది.
520 మంది డయాలసిస్ పేషెంట్లకు..
డయాలసిస్ పేషెంట్లు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతూ కొందరు వారానికి రెండు మూడు సార్లు, మరి కొందరు ప్రతి రోజూ డయాలసిస్ చేయించుకునే పరిస్థితి ఏర్పడింది. వీరికి ఇప్పటికే ప్రతి ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం పూర్తి ఉచితంగా డయాలసిస్ చేస్తోంది. అంతే కాకుండా ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండకూడదనే ఉద్దేశంతో ఉచితంగా బస్సు పాసులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఈ నేపథ్యంలో వీరికి స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా నెలకు రూ.2,016 చొప్పున ఆసరా పింఛన్లు మంజూరు చేస్తున్నారు. జిల్లాలో 520 మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నట్లు తెలుస్తుండగా ఆగస్టు 15 నుంచి వీరికి పింఛన్లు అందనున్నాయి. ఎక్కడి ఎమ్మెల్యేలు అక్కడే పంపిణీ చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కోరారు.
నిరుపేదల దేవుడు కేసీఆర్
ఓదెల. ఆగస్టు 6 : ఈ నెల 15వ తేదీ నుంచి 10 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఓదెల మండలంలోని హరిపురంలో శనివారం ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. నిరుపేదల దేవుడు సీఎం కేసీఆర్ అంటూ కొనియాడారు. ఇక్కడ సర్పంచ్ గుండేటి మధు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.