ఖలీల్వాడి/కామారెడ్డి, ఏప్రిల్ 17: ఉమ్మడి జిల్లాలో కంటివెలుగు శిబిరాలు జోరుగా కొనసాగుతున్నాయి. వైద్యారోగ్య సిబ్బంది ఊరూరా అవగాహన కల్పించడంతో ప్రజలు ఉత్సాహంగా శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 7లక్షల 41వేల 712 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సుదర్శనం తెలిపారు. సోమవారం 8,911 మందికి కంటిపరీక్షలు నిర్వహించి, దృష్టిలోపం ఉన్న 883 మందికి కంటి అద్దాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 4,35,512 మందికి నేత్ర పరీక్షలు చేసినట్లు తెలిపారు. 78,198 మందికి కండ్లద్దాలు అందజేశామని వివరించారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సోమవారం 44 వైద్య బృందాలతో కంటి వెలుగు శిబిరాలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో డాక్టర్ లక్ష్మణ్సింగ్ తెలిపారు. మొత్తం 5,073 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 459 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 3,06,200 మందికి కంటి పరీక్షలు, 46,717 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశామని చెప్పారు.