కామారెడ్డి, జూన్ 10 : ఆంగ్ల మాధ్యమంలో బోధన విప్లవాత్మక నిర్ణయం.. ఇది పేద గ్రామీణ విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో తల్లిదండ్రులకు మరింత నమ్మకం పెరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఆంగ్ల మాధ్యమంలో విద్యనందించేందుకు మన ఊరు-మన బడి దోహదపడబోతున్నది. ఫలితంగా ఎంతోమంది పేద విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లతో పోటీపడే స్థాయికి ఎదుగుతారు.
శిక్షణా కార్యక్రమాలు…
కామారెడ్డి జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో ఇంగ్లిష్ మీడియం బోధన అమలు దిశగా చర్యలు చేపట్టారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ద్వారా బోధన అమలుకు నిర్ణయించారు. ఈ మేరకు ఉపాధ్యాయుల్లో బోధనా నైపుణ్యాన్ని మెరుగుపరిచేలా దశల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. 2024-25 విద్యా సంవత్సరం వరకు పదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రారంభించేలా ప్రణాళికలను అమలు చేసే దిశగా చర్యలు చేపట్టారు. రాష్ట్ర స్థాయిలో 5 రోజుల పాటు మొదటి దఫా శిక్షణా కార్యక్రమాన్ని ఆన్లైన్లో బెంగళూర్ అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్ధ (ఎస్సీఈఆర్టీ) సంయుక్తంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా నుంచి ముగ్గురు రీసోర్స్ పర్సన్ల శిక్షణ తర్వాత జిల్లా పరిధిలో 60 మంది ఉపాధ్యాయులకు మెంటర్స్ శిక్షణ ఇచ్చారు. ఆంగ్లమాధ్యమ బోధన విషయంలో కామారెడ్డి జిల్లాలో ఉన్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, ఉపాధ్యాయులకు 9 విడుతల్లో శిక్షణ ఇచ్చారు.
నైపుణ్యాలు సాధించడమే లక్ష్యంగా కార్యక్రమాలు…
ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది తెలుగు మీడియం నుంచి వచ్చిన వారే కావడంతో ఇంగ్లిష్ మీడియం బోధనకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యం లో ఉపాధ్యాయులకు క్షేత్రస్థాయిలో వృత్యంతర శిక్షణ నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలలోని ఎస్జీటీలకు, భాషా పండితులు, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టులు బోధించే స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణ నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత ఆన్లైన్ ద్వారా మూడు వారాల పాటు శిక్షణ ఇచ్చారు. ఇకపై అన్ని ప్రభు త్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రాథమిక , ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో 2022-23విద్యాసంవత్సరంలో 8వ తరగతి వరకున్న విద్యార్థులకు ఆంగ్ల బోధన అందించనున్నారు. దీంతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడంతో పాటు మన ఊరు-మన బడితో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. కామారెడ్డి జిల్లాలో 1,011 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 95 వేల మంది విద్యార్థులు చదువుకుంటు న్నారు. 181 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 816 మండల పరిషత్, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. నాణ్యమైన విద్య అందించడం, మౌలిక వసతులను కల్పించడంపై సర్కార్ దృష్టి సారించింది.
పాఠశాల తరగతి గదులకు పెద్దపీట
మన ఊరు-మన బడి కార్యక్రమంతో కొత్త తరగతి గదుల నిర్మాణం చేపట్టబోతున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయనున్నారు. వీటిలో ప్రధానంగా తరగతి గదుల నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే మన ఊరు-మన బడి కింద చేపట్టనున్న పనులపై ఇంజినీరింగ్ అధికారులతో అంచనాలు సిద్ధం చేస్తున్నారు. కొత్త తరగతి గదుల నిర్మాణంలో ప్రభుత్వ నిధులతో పాటు దాతల సహకారాన్ని తీసుకోను న్నారు. అంతే కాకుండా మండల పరిషత్, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ పాఠశాలల నిర్వహణ కోసం ఇక నుంచి నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసి, అభివృద్ధిలో పాలుపంచుకొనే విధంగా చర్యలు చేపట్టబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని మూడు విడుతల్లో చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొదటి విద్యాసంవత్సరం 2022-23లో 33శాతం పాఠశాలల్లో మన ఊరు-మన బడి పథకం కింద మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.
ఇంగ్లిష్ మాధ్యమంలో బోధనకు సన్నాహలు
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మాధ్యమం, డిజిటల్ బోధనకు సన్నాహాలు చేస్తున్నాం. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో కార్పొరేట్కు ధీటుగా విద్యాబోధన కారణంగా విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. ఇంగ్లిష్ మీడియం బోధన కోసం కామారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం. ఉపాధ్యాయుల్లో బోధనాపై నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉపయోగపడేలా శిక్షణా కార్యక్రమం చేపట్టాం.
–రాజు, డీఈవో, కామారెడ్డి