నిజామాబాద్ రూరల్, జూన్ 10: ఉమ్మడి జిల్లాలో నేడు స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్సీ పర్యటించనున్నారు. జాతీయస్థాయిలో ఉత్తమ జీపీగా ఎంపికైన నిజామాబాద్ జిల్లా రూరల్ మండలంలోని పాల్దా గ్రామానికి రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ శనివారం రానున్నారు. ఐదో విడుత పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో చేపట్టిన పనులను వారు పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం మేరకు జిల్లా ఉన్నతాధికారులు, మండల, గ్రామస్థాయి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పాల్దాలో రూ.16 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని మంత్రులు ప్రారంభించనున్నారు. అనంతరం మహాలక్ష్మీ మందిర ఆవరణలో పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొంటారు. మంత్రులు పాల్గొనే సభావేదిక ఏర్పాట్లను రెవెన్యూ అధికారులు పరిశీలించారు.శుక్రవారం సాయంత్రం కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు మంత్రులు పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట జడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో చందర్నాయక్, డీపీవో జయసుధ, ఏపీడీ సంజీవ్కుమార్, ఆర్డీవో రవి, డీఎల్పీవో నాగరాజు, ఎంపీడీవో మల్లేశ్, తహసీల్దార్ ప్రశాంత్కుమార్, ఎంపీవో మధురిమ, సర్పంచ్ సుప్రియ, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
అంకోల్ క్యాంపులో ఏర్పాట్లను పరిశీలించిన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి
నస్రుల్లాబాద్/బాన్సువాడ రూరల్, జూన్ 10: కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్ క్యాంపు గ్రామానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత శనివారం రానున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని సోలార్ సిస్టం పనితీరును పరిశీలించారు. స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్సీకి స్వాగతం పలికేందుకు ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 8.30 గంటలకు కొయ్యగుట్ట అమరవీరుల స్థూపం వద్ద మంత్రుల బృందానికి స్వాగతం పలికి అక్కడి నుంచి బాన్సువాడ వరకు చేపట్టే భారీ బైక్ ర్యాలీలో పాల్గొనాలని కోరారు. ఆయన వెంట ఎంపీపీ పాల్త్య విఠల్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మాజీద్, గ్రామ సర్పంచ్ వెంకటరమణ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సాయిలు యాదవ్ తదితరులు ఉన్నారు.