నిజామాబాద్, మే 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి);యాసంగి ధాన్యం సేకరణ చివరి దశకు చేరుకున్నది. ఉమ్మడి జిల్లాలో వడ్ల కొనుగోలు ప్రక్రియ త్వరలోనే ముగియనున్నది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కొర్రీలు పెట్టినా, రైతులకు ఇబ్బందులు కలుగకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ వడ్లు కొనాలని నిర్ణయించారు. కనీస మద్దతు ధరతో రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం సేకరించేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. పుట్ల కొద్దీ వడ్లను రైతులు కేంద్రాలకు తరలించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వడ్లు కొనుగోలు చేశారు. చెల్లింపుల్లో సాంకేతికతను ఉపయోగించి అక్రమాలకు అడ్డుకట్ట వేశారు. ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే టాప్-10లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు నిలిచాయి. ఇప్పటివరకు రూ.1,545 కోట్ల విలువైన 7.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి రికార్డు సృష్టించాయి. మరోవైపు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ధాన్యం రాకుండా నిఘా పెట్టడం సత్ఫలితాలనిచ్చింది. చెడగొట్టు వానలతో తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేసేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు సాగంటే దండగ. కరెంట్ కష్టాలు, సాగు నీటి గోస, ఎరువులు, విత్తనాల కొరత. ఇలా చెప్పుకుంటూ పోతే పొలంలో అడుగు పెట్టాలంటేనే కర్షకుడికి కన్నీళ్లు తన్నుకు వచ్చేది. కాలం కలిసొచ్చినప్పటికీ ధైర్యం చాలక మిన్నకున్న సందర్భాలు అనేకం. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ప్రభుత్వాలు కొనకుండా తాత్సారం చేయడంతో రైతు కష్టమంతా దళారులు తన్నుకు పోయేది. తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత కర్షకుడికి సీఎం కేసీఆర్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
ఎనిమిదేండ్లలో వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మకమైన మార్పులతో అన్నదాతలు ఆనందంగా జీవిస్తున్నారు. వరి సాగు చేసిన రైతుకు కనీస మద్దతు ధరతో రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి మేలును చేకూరుస్తున్నది. ఎనిమిదేండ్ల కింద అంతంత మాత్రంగానే ఉన్న దిగుబడులు ఇప్పుడు ఏకంగా రెట్టింపు స్థాయికి పెరిగాయి. నీటి వసతి, పెట్టుబడి సాయం, నిరంతర విద్యుత్తో సాఫీగా సాగుదారులు అడుగు ముందుకేస్తున్నారు. కాలంతో పనిలేకుండా కేసీఆర్ అనే మూడక్షరాలను నమ్ముకొని ఏడాదంతా పంటలను పండిస్తున్నారు. గడిచిన యాసంగి సీజన్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం రాసులు వెల్లువెత్తాయి. వ్యవసాయ శాఖ అంచనాలకు తగ్గట్లుగానే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు రూ.1545 కోట్ల విలువతో 7లక్షల 89వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం విశేషం.
టాప్ 10లో ఉభయ జిల్లాలు…
ధాన్యం కొనుగోళ్లలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు రాష్ట్రస్థాయిలో దుమ్ము రేపుతున్నాయి. ప్రణాళికాబద్ధంగా వరి పంట దిగుబడులను సేకరించడం ద్వారా మిగిలిన జిల్లాల కన్నా మేలైన ప్రతిభను యంత్రాంగం కనబరుస్తున్నది. వేగంగా, పారదర్శకంగా సమయానికి అనుగుణంగా ధాన్యాన్ని సేకరించి రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల పరంగా నల్లగొండ తర్వాత నిజామాబాద్ ఉమ్మడి జిల్లా టాప్ 2 స్థానం లో ఉంది. ఇక జిల్లాల వారీగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లా లు టాప్ 10లో చోటు సంపాదించుకున్నాయి. నల్లగొండ, జగిత్యాల తర్వాత తదుపరి స్థానాలను ఇరు జిల్లాలు ఆక్రమించా యి.
చెడగొట్టు వానలతో కాసింత ఉపద్రవం ముంచుకొచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేస్తూ ఇరు జిల్లాలకు చెందిన పౌరసరఫరాల సంస్థ యంత్రాంగం చాకచక్యంగా ధాన్యాన్ని సేకరించింది. తీవ్ర వానలతో కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజామాబాద్, రూరల్, జుక్కల్, బోధన్, ఆర్మూర్లో ధాన్యం తడిసిముద్దవ్వగా… ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో ప్రకృతి రూపంలో ఎదురైన ఇక్కట్లు మటు మాయమయ్యాయి. ఇక కేంద్ర ప్రభుత్వం మాటిమాటికీ ఇక్కట్లకు గురి చేస్తున్నప్పటికీ రైస్మిల్లర్లతో సమన్వయం చేసుకుంటూ ధాన్యం తరలింపులోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. ఎఫ్సీఐ గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈసారి తనిఖీలతో మిల్లర్లను ఇక్కట్లకు గురిచేసినప్పటికీ రైతుకు బాధ కలుగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంతో ప్రక్రియ సాఫీగా ముగింపునకు చేరింది.
రూ.1545 కోట్లతో 7.89లక్షల మెట్రిక్ టన్నులు..
నిజామాబాద్ జిల్లాలో ధాన్యం సేకరణకు 472 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి 457 కేంద్రాల్ని ప్రారంభించారు. ప్రస్తుతం 275 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి కావడంతో మూసేశారు. 82 కేంద్రాల్లో ప్రక్రి య కొనసాగుతున్నది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తం గా రూ.1148 కోట్ల విలువ చేసే 5లక్షల 85వేల 962 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. మొత్తం 82వేల 464 మంది రైతుల నుంచి పంటను సేకరించి మద్దతు ధరను కల్పించారు. సేకరించిన ధాన్యానికి నిర్ణీత గడువులోగా డబ్బులు జమ చేస్తున్నారు.
కస్టమ్ మిల్లింగ్ రైస్లో భాగంగా 5లక్షల 65వేల 977 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. రూ.734 కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయి. కామారెడ్డి జిల్లాలో ప్రతిపాదనలకు అనుగుణంగా 344 కేంద్రాలను ప్రారంభించగా, సగం కేంద్రాల్లో ధాన్యం రాక నిలిచిపోవడంతో సెంటర్లను మూసేశారు. రూ.397 కోట్ల విలువ చేసే 2లక్షల 3వేల 668 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 38,782 మంది రైతుల నుంచి సేకరించారు. లక్షా 48వేల 926 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం రైస్ మిల్లులకు తరలించారు. రూ.256కోట్ల చెల్లింపులు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.1545 కోట్లతో 7లక్షల 89వేల 630 మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయ్యింది. 1,21,246 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించగా రూ.990 కోట్ల చెల్లింపులు జరిగాయి.
అక్రమాలకు అడ్డుకట్ట..
ధాన్యం కొనుగోళ్ల చెల్లింపుల్లో ఉన్న లోపాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసింది. గతేడాది ఇదే సీజన్ నుంచి నూతన విధానంలో సాంకేతికతను వినియోగించి కొనుగోళ్లు జరిపారు. ధాన్యం కొనుగోళ్ల చెల్లింపుల కోసం ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్లను అనుసంధానం చేయడంతో నేరుగా పంటలు పండించిన రైతు నుంచే ధాన్యాన్ని సేకరించారు. గతంలో ధాన్యం కొనుగోళ్ల సమయంలో పట్టాదారు పాసు పుస్తకంలో పేరుతో సంబంధం లేకుండా ట్రక్ షీట్లో ఎవరి పేరు రాస్తే వారి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేసేవారు. కొన్ని సందర్భాల్లో పట్టాదారు, బ్యాంకు అకౌంట్కు పొంతన ఉండకపోవడంతో అక్రమాలు జరిగేవి. ఈ వెసులుబాటుతో కొందరు దళారులు దొడ్డి దారిలో రాజ్యమేలారు. ఇందులో వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ, రైస్ మిల్లర్లు కుమ్మక్కు కావడం చాలా చోట్ల వెలుగు చూసింది. మరోవైపు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ధాన్యం రాకుండా చెక్పోస్టుల ద్వారా నిఘా పెట్టడం సత్ఫలితాలనిచ్చింది. తెలంగాణకు లారీల్లో తరలించిన ఇతర రాష్ర్టాల ధాన్యాన్ని నిలిపి వేసి రిటర్న్ పంపించిన దాఖలాలు ఈ సీజన్లో వెలుగు చూశాయి.
సవాళ్లను అధిగమించి ధాన్యం సేకరించాం…
యాసంగిలో వానకాలం కన్నా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. ఇతర పంటల వైపు కొద్ది మంది దృష్టి మళ్లించినప్పటికీ వరి దిగుబడులు భారీగా వస్తాయ ని అంచనాలు వచ్చాయి. ప్రభుత్వం ధా న్యం సేకరణకు ఆదేశాలు ఇవ్వడంతో యంత్రాంగం అప్రమత్తమై యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశాం. గత అనుభవాలతో రెవెన్యూ, వ్యవసాయ, పౌరసరఫరాలు, పోలీసు, రవాణా శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో కృషి చేశారు. కర్షకుడికి ఇబ్బంది తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మద్దతు ధరను కల్పించాం. ధాన్యం సేకరణ ప్రక్రియ దాదాపుగా ముగింపునకు చేరినట్లే.