రెంజల్/ముప్కాల్, మే 31: నిజామాబాద్ జిల్లాలోని రెంజల్, ముప్కాల్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ముప్కాల్ మండలంలో సోమవారం రాత్రి, రెంజల్ మండలంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో జనవాసాలకు తీవ్ర నష్టం కలిగింది. రెంజల్ మండలం కందకుర్తిలో విద్యుత్స్తంభాలు నేలకొరిగా యి.దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో ఎక్బాల్ బేగ్, ఖాదీర్బేగ్ ఇం డ్లపై నుంచి రేకులు ఎగిరిపడ్డాయి. ఇంట్లో నిల్వ ఉంచిన వంట సరుకులు కురిసిన భారీ వర్షానికి తడిసిపోయాయి. గుంతల్లో నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ముప్కాల్ మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మండల కేంద్రానికి చెందిన హరీన్, రఫీ, కుమార్ మేస్త్రీలకు చెందిన ఇండ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. బాధిత కుటుంబాలను టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సామ వెంకట్రెడ్డి, మండల కో- ఆప్షన్ సభ్యుడు మునీరుద్దీన్ పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసానిచ్చారు. నష్టాన్ని అంచనా వేసి తుది నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపిస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు. నష్టాన్ని అంచనా వేసిన వారిలో సీనియర్ అసిస్టెంట్ దశరథ్, ఆర్ఐ గంగారాం, సహాయ సిబ్బంది ఉన్నారు.