మాక్లూర్, మే 31: సీఎం కేసీఆర్ను విమర్శిస్తే సహించేదిలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు హెచ్చరించారు. ఈటల ప్రస్తుత పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ఉందన్నారు. మంగళవారం జడ్పీ చైర్మన్ ఎంపీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో ఎన్ని రోజులు ఉంటాడో తెలియని పరిస్థితిలో ఉండి మాట్లాడుతున్నాడని విమర్శించారు. త్వరలోనే బీజేపీ నుంచి బయటికి వచ్చే అయోమయ పరిస్థితిలో ఉన్నాడని ఆయన సన్నిహితుల ద్వారా తెలిసిందన్నారు.
కేసీఆర్ చచ్చుడో-తెలంగాణ వచ్చుడో అని నినదించి, యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి రా ష్ర్టాన్ని తెచ్చిన ఉద్యమనేత కేసీఆర్ను విమర్శించే స్థాయి ఈటలకు లేదన్నారు. రాష్ర్టాభివృద్ధి కోసమే ప్రశాంత్కిశోర్లాంటి మేధావుల సలహాలు, సూచనలను సీఎం కేసీఆర్ తీసుకోవడంలో తప్పు ఏముందని ప్రశ్నించారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి కర్త, కర్మ, క్రియలాంటి వారని అన్నారు. సామాన్య కార్యకర్త అయిన ఈటల రాజేందర్ను అక్కున చేర్చుకొని అందలమెక్కిస్తే.. కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేశాడని అన్నారు. సమావేశంలో నుడా చైర్మన్ చామకూర ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ మాస్త ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.