నిజామాబాద్, జులై 2, (నమస్తే తెలంగాణ ప్రతినిధి):ఒకప్పుడు గ్రామాలు పచ్చని తోరణంతో కనిపించేవి. ఊరూ, వాడ ఆకుపచ్చని వనంలా దర్శ నం ఇచ్చేది. పల్లెలపైనా ఆధునిక పోకడల ప్రభావంతో రోజురోజుకూ గ్రామాలు కుచించుకుపోయాయి. సహజ వనరుల దోపిడీ, రహదారుల విస్తరణ, నూతన హంగులతో నిర్మాణాలు వంటి కారణాలతో ఏపుగా పెరిగిన చెట్లు, వనాలు అంతరించి పోతున్నాయి. ఫలితంగా గ్రామాల్లో మొక్కల సంరక్షణ అన్నది ప్రత్యేక రాష్ట్రం రాకముందు వరకు క్లిష్టమైన పనిగానే కనిపించింది.
స్వచ్ఛంద సంస్థల ద్వారా మొక్కలు నాటితే అదే గొప్పగా ఫీలయ్యే పరిస్థితి ఎదురైంది. కానీ ఇప్పుడు స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనలో భాగంగా భవిష్యత్తు తరాలకు మేలు చేయాలని హరితహారం కార్యక్రమానికి సంకల్పించారు. చెట్లు ఉంటే క్షేమం… లేకుంటే క్షామం అన్న సూత్రాన్ని ప్రజల్లోకి కొంగొత్తగా తీసుకుపోయారు. వానలు వాపస్ రావాలంటే… వానరాలు వాపస్ పోవాలంటే.. చెట్లు నాటాలంటూ తనదైన శైలిలో సీఎం కేసీఆర్ చైతన్య పరిచారు. అలా మొదలైన హరితహారం ఇప్పుడు గ్రామాల్లో ఉద్యమంగా మారింది. నిధులు లేక వెలవెలబోయిన పంచాయతీలకు రాష్ట్ర సర్కారు నెల వారీగా ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు మంజూరు చేస్తున్నది అందులో 10శాతం గ్రీన్ బడ్జెట్కు కేటాయించడంతో పాలకవర్గాలకు మొక్కల పెంపకం, సంరక్షణ సులువుగా మారింది.
ఊరూరా నర్సరీలు..
పంచాయతీలకు నెలవారీగా ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ నిధులు మంజూరు చేస్తుండగా, అందులో నుంచి 10శాతం కేటాయింపులు ఆటోమెటిక్గా గ్రీన్ బడ్జెట్గా రూపాంతరం చెందుతుండడంతో ఎప్పటికప్పుడు హరితవనాల వృద్ధికి పంచాయతీ పాలకవర్గాలు ఖర్చు చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామ పంచాయతీల్లో జీపీకి ఒకటి చొప్పున నర్సరీలు ఏర్పాటు అయ్యాయి. వీటిలో 97.32 లక్షల మొక్కలను పెంచుతున్నారు. కామారెడ్డి జిల్లాలోనూ 526 గ్రామ పంచాయతీ నర్సరీల్లో 67.55 లక్షల మొక్కలు పెంచుతుండడం గమనార్హం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జూలై 1 నుంచి మొదలైన పల్లె ప్రగతిలో ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. పంపిణీ చేస్తున్న మొక్కలన్నీ స్థానికంగా గ్రామ నర్సరీల్లోనే పెంచినవి కావడం విశేషం. గతంలో ఇతర ప్రాంతాల నుంచి మొక్కలు కొనుగోలు చేసి తీసుకురావడం ప్రభుత్వానికి తీవ్రమైన భారం పడేది. ఇప్పుడు వృథా ఖర్చు తగ్గడంతోపాటుగా రవాణా ఇక్కట్లు పూర్తిగా సమిసిపోయాయి.
ఉమ్మడి జిల్లాలో రూ.44.96 కోట్లు
గ్రామాల్లో మొక్కలు పెంపకం తప్పనిసరిగా మారడంతో మొక్కలు నాటడం, వాటి సంర క్షణకు నిధుల బెడద పాలకవర్గాలకు వెంటా డుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ చ్చే నిధులను వచ్చినవి వచ్చినట్లే ఖర్చు చేయడం సర్పంచులకు అలవాటుగా మారిన పని. మౌళిక సదుపాయాల పేరిట చేసే ఖర్చుతో రూ.కోట్లు వచ్చినప్పటికీ పంచాయతీ ఖాతాలో చిల్లి గవ్వ మిగిల్చే దుస్థితి లేదు. దీంతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా గ్రీన్ బడ్జెట్ను తీసుకువచ్చారు. పంచాయతీలకు వచ్చే నిధుల్లో 10శాతం గ్రీన్ బడ్జెట్ కింద పక్కకు పెట్టాలి. ఈ మొత్తాన్ని గ్రామ పరిధిలో మొక్కల సంరక్షణకు ఖర్చు చేయడమే ముఖ్యోద్దేశం. నిజామాబాద్ జిల్లాలోని 530 గ్రామ పంచాయతీల్లో రెండేం డ్లలో రూ. 20.60 కోట్లు, కామారెడ్డి జిల్లాలో 526 గ్రామ పంచాయతీల్లో రూ.24.36 కోట్లు గ్రీన్ బడ్జెట్లో భాగంగా జమ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండేండ్లలో రూ.44.96 కోట్లు గ్రీన్ బడ్జెట్గా రూపాంతరం చెందడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పల్లెల్లో పచ్చందాలు..
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోనూ వేలాది హెక్టార్లలో అటవీ విస్తీర్ణం మటుమాయమైంది. పోడు వ్యవసాయం పేరిట కొంత, కలప రవాణా తో మరింత అటవీ సంపద కుంగిపోతుంది. వీటి లో రకరకాల చెట్లు, పూలు, ఔషధ మొక్కలున్నా యి. అయితే అక్రమార్కుల వేటుకు అన్ని మొక్క లు అంతరించిపోతున్నాయి. గడిచిన ఏడేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ ప్రధానంగా అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు కంకణం కట్టుకున్నారు. హరితహారం పేరిట ఉద్యమం మాదిరిగా మొక్కల సంరక్షణకు పాటుపడుతున్నారు. తొలి మూడు విడుతల్లో పంచాయతీలకు మొక్కలను ప్రభుత్వమే వివిధ శాఖల ద్వారా మొక్కలు పంపిణీ చేసింది. నూతన పంచాయతీరాజ్ చట్టం మనుగడులోకి వచ్చిన తర్వాత మొక్కలను పెంచేందుకు గ్రామాల్లోనే నర్సరీలు ఏర్పాటు చేశారు.
పట్నంలెక్క మారుతున్నది..
నేను 1970లో సర్పంచ్ తనం జేసినప్పుడు పంచాయతీలకు పైసలు ఇచ్చేటోళ్లు కాదు. గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయంపైనే దారుమదార్గా ఉండేది. గిప్పుడు పట్నాలను తీసిపోకుండా ఊర్లను మంచిగ చేసేందుకు సర్కారు పల్లెప్రగతి పెట్టింది. ఇగ అన్ని సౌలత్లతో పట్నంలెక్కన ఊర్లు మారుతున్నాయ్. ఇంతకు ముందు పట్నాలకు పోయినోళ్లు
ఊర్ల ఉండేందుకు అస్తుండ్రు.
-ఏ. శంకర్గౌడ్, మాజీ సర్పంచ్ సాటాపూర్