నిజామాబాద్, జూలై 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్, కామారెడ్డి జిల్లా భౌగోళిక స్వరూపం మరోసారి మార్పునకు నోచుకున్నది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోవడంతో మరికొన్ని కొత్త మండలాలు వచ్చి చేరాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ జీవోలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ విడుదల చేశారు. ఈ మేరకు ఉభయ జిల్లాల్లోనూ కొత్త మండలాలు ఏర్పాటు కావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం 29 మండలాలున్నాయి. కొత్తగా మూడు మండలాలు చేరడంతో వీటి సంఖ్య 32కు చేరింది. కామారెడ్డి జిల్లాలో 22 మండలాలున్నాయి. ఒక మండలం కొత్తగా ఏర్పాటు కావడంతో ఈ సంఖ్య 23కు చేరింది. బోధన్, జుక్కల్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో నూతన మండలాలు పురుడు పోసుకున్నాయి. 2016 అక్టోబర్ 11 నాటికి పాత నిజామాబాద్ జిల్లాలో కేవలం 36 మండలాలు మాత్రమే ఉన్నాయి. ఉమ్మడి జిల్లా కాస్తా రెండుగా చీలడంతో మండలాల సంఖ్య 51కు చేరింది. ప్రస్తుతం మరికొన్ని కొత్త మండలాల చేరికతో ఏకంగా 55 మండలాలు కార్యరూపం దాల్చాయి.
ఆర్మూర్లో ఇక ఐదు మండలాలు..
కొత్త మండలాల కూర్పు చాలా శాస్త్రీయబద్ధంగా నిర్వహించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రస్తుతం 3 మండలాలున్నాయి. మాక్లూర్, నందిపేట, ఆర్మూర్ మండలాలు భౌగోళికంగా పెద్దగా ఉండడంతో నూతన మండలాలకు ఆస్కారం ఏర్పడింది. ప్రస్తుతం ఆర్మూర్ మండలంలో గ్రామ పంచాయతీగా కొనసాగుతున్న ఆలూర్ ఇకపై మండల కేంద్రంగా మారబోతున్నది. ఇందులో మొత్తం 10 గ్రామాలను చేర్చారు. ఆర్మూర్ నుంచి ఆలూర్, మిర్దాపల్లి, దేగాం, మచ్చర్ల, గగ్గుపల్లి, రాంపూర్లున్నాయి. నందిపేట మండలం నుంచి సిద్దాపూర్, వన్నెల్(కె)లను చేర్చారు. ఇక మాక్లూర్ మండలంలోని కల్లెడి, గుత్ప గ్రామాలను ఆలూర్ మండలంలోనే కలిపారు. నందిపేట మండలం నుంచి 12 గ్రామ పంచాయతీలతో డొంకేశ్వరం కొత్త మండలముగా రూపుదిద్దుకున్నది. ఇందులో డొంకేశ్వర్, తొండాకూర్, దత్తాపూర్, గంగసముద్రం, సిర్పూర్, అన్నారం, మారంపల్లి, నూత్పల్లి, జీజీ నడ్కుడ, గాదెపల్లి, కోమట్పల్లి, నికాల్పూర్, చిన్నయానంలను కలిపారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3 మండలాలుండగా ఇకపై 5 మండలాలతో కొత్త శోభను సంతరించుకున్నది.
17 గ్రామాలతో సాలూరా
బోధన్ నియోజకవర్గంలో కొత్త మండలం ఆవిర్భవించింది. బోధన్ రెవెన్యూ మండలంలో భాగమైన పల్లెలను విభజించి సాలూరా నూతన మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో మొత్తం 17 గ్రామ పంచాయతీలను చేర్చారు. సాలూరా, మందర్నా, హున్సా, ఖాజాపూర్, ఫతేపూర్, తగ్గెల్లి, సాలంపాడ్, లక్ష్మాపూర్, కుమ్మన్పల్లి, జాడి జమాల్పూర్, రాంపూర్, కల్దుర్కి, సిద్దాపూర్, ఖండ్గావ్, భిక్నెల్లి, హంగర్గ, కొప్పర్గ ఇకపై కొత్త మండలంలో కొనసాగుతాయి. నూతన మండలాల ఏర్పాటుతో ప్రజలకు భారీ ఉపశమనం దక్కనున్నది. రెవెన్యూ, పోలీస్, ఇతరత్రా సేవలు త్వరితగతిన అందించడానికి వెసులుబాటు కానున్నది. తహసీల్, మండల పరిషత్, పోలీస్ ఠాణాలు కొత్తగా ఏర్పాటు కావడంతోపాటు మండలం యూనిట్గానూ అభివృద్ధి ఫలాలు సైతం ప్రజలకు మంజూరవుతాయి. శాంతి, భద్రతల పర్యవేక్షణతోపాటు రెవెన్యూ పరిపాలన సైతం క్షేత్రస్థాయికి చేరుతున్నది.
15 గ్రామాలతో డొంగ్లీ మండలం
మద్నూర్ మండలంలో 38 గ్రామాలు ఉండగా ఇందులో నుంచి 15 గ్రామాలను కలుపుకొని నూతనంగా 23వ మండలంగా డొంగ్లీని ఏర్పాటు చేయనున్నారు. మద్నూర్ మండలంలోని డొంగ్లీ, మోఘా, లింబూర్, హసన్టాక్లీ, పెద్ద టాక్లీ, సిర్పూర్, మదన్హిప్పర్గా, ఎలేగావ్, యనభూర, కుర్లా, దోతీ, మల్లాపూర్, లచ్మాపూర్ మారేపల్లి, చిన్నపూర్ మొత్తం 15 గ్రామాలతో నూతనంగా డొంగ్లీ మండలంగా ఏర్పాటుకానున్నది.
సీఎం కేసీఆర్కు మంత్రి వేముల ప్రత్యేక కృతజ్ఞతలు
ఖలీల్వాడి, జూలై 23 : నిజామాబాద్ జిల్లాలో మూడు కొత్త మండలాల (డొంకేశ్వర్, ఆలూర్, సాలూరా)లు ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్కు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల ఆకాంక్ష మేరకు…
తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలనా సంస్కరణలను అమల్లోకి తీసుకు వచ్చారు. ఇందులో భాగంగా దశాబ్దాలుగా ప్రజలు కోరుకుంటున్న నూతన జిల్లాలకు నాంది పలికారు. పాలనాపరంగా ప్రజలకు సౌలభ్యతను తీసుకువచ్చేందుకు జిల్లాల పునర్విభజన చేశారు. ఒకప్పుడు నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ పర్యటన చేయాలంటే ఒక రోజు సమయం సరిపోయేది కాదు. జుక్కల్ లాంటి ప్రాంతానికి వెళ్లి రావాలన్నా కష్టమయ్యేది. రెండుగా జిల్లాలు ఏర్పడడంతో పర్యవేక్షణ పెరిగి సుపరిపాలన అందుతున్నది. ఇక మండలాల ఏర్పాటు కూడా పలు చోట్ల అనివార్యమైంది. గతంలో పాలకులు నిర్లక్ష్యం వహించడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండగా జిల్లాలతో పాటే మండలాలను సైతం సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయడంతో మేలు చేకూరింది. ప్రజలకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన గత్యంతరం తీరింది. దగ్గర్లోనే జిల్లా కేంద్రం ఉండడంతో ఆయా ప్రభుత్వ శాఖలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లా, మండలాలు పునర్విభజన అనంతరం అక్కడక్కడా పెద్ద మండలాల్లో ఇబ్బందుల దృష్ట్యా ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన వినతులు పరిగణలోకి తీసుకుని తాజాగా మరికొన్ని మండలాలను సీఎం ఏర్పాటు చేశారు.
మండలాల ఏర్పాటుపై ఎమ్మెల్సీ కవిత హర్షం
జిల్లాలో మరో మూడు కొత్త మండలాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయడంపై ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థం డొంకేశ్వర్, ఆలూర్, సాలూరా మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమ ప్రతిపాదనను ఆమోదించిన సీఎం కేసీఆర్కు ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సాలూరా మండలం ఏర్పాటు హర్షణీయం
బోధన్, జూలై 23: ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్ద మండలం బోధన్ .. ఇంత పెద్ద మండలాన్ని విభజన చేయాలని, సాలూరా కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటుచేయాలని చాలాకాలంగా కోరుతున్నాం.. ఈ విషయమై సీఎం కేసీఆర్ స్పందించి సాలూరా మండలం ఏర్పాటుకు నిర్ణయించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ప్రజలకు పాలనను మరితంగా చేరువకు తీసుకురావాలన్న ఉద్దేంతో సీఎం కేసీఆర్ కొత్తగా మండలాల విభజన చేపట్టడం, ఇందులో భాగంగా సాలూరా మండలం ఏర్పాటుకావడం జరిగింది. ఇందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– బుద్దె సావిత్రి, బోధన్ ఎంపీపీ
కొత్త మండలాలతో పాలనా సౌలభ్యం
కొత్తగా కొత్త మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేయడం సంతోషకరం.. సాలూరా కేంద్రంగా మండలం ఏర్పాటుచేయాలని చుట్టుపక్కల ప్రజలు ఎంతోకాలంగా కోరుతున్నారు. ప్రజల కోరిక మేరకు సాలూరా మండలం ఏర్పాటుచేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. గతంలో అనేక కొత్త మండలాలను ఏర్పాటుచేశారు. అయినప్పటికీ, ఇంకా పెద్ద మండలాలుగా ఉన్నవాటిని విభజించి కొత్తగా మరికొన్ని మండలాలను ఏర్పాటుచేయడంతో మా సాలూరాకు మండల కేంద్రమయ్యే అదృష్టం దక్కింది.
– కేజీ గంగారాం, రైతు, సాలూరా