తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ ఖ్యాతి ఖండాంతరాల్లో వెలుగొందుతున్నది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విశేష కృషితో దేశవిదేశాల్లో సమున్నత గౌరవం దక్కింది. బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పే వినూత్న ప్రయత్నానికి తెలంగాణ జాగృతి సిద్ధమైంది. ఇందుకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా గుర్తింపు పొందిన దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా వేదిక కానున్నది. బుర్జ్ ఖలీఫా భవనంపై ఎల్ఈడీ లైట్ల ధగధగల మధ్య లేజర్ షోతో మన బతుకమ్మ అట్టహాసంగా కనువిందుచేయబోతున్నది. ఈ భవనంపై ఈ నెల 23న నిర్వహించే కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.
నిజామాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు రూపమైన బతుకమ్మ విశ్వవీధిలో ఊరేగనున్నది. బతుకమ్మ ఖ్యాతి సమున్నత పతాకమై ఎగురనున్నది. తెలంగాణ జాగృతి ద్వారా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటికే పూల పండుగ విశిష్టతను ఖండాంతరాలకు చాటిచెప్పారు. విశిష్టమైన బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పేందుకు వినూత్న ప్రయత్నానికి తెలంగాణ జాగృతి సిద్ధమైంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా గుర్తింపు పొందిన దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుర్జ్ ఖలీఫా భవనంపై ఎల్ఈడీ లైట్ల ధగధగల మధ్య లేజర్ షోలతో మన బతుకమ్మ అట్టహాసంగా కనువిందుచేయబోతున్నది.
అక్టోబర్ 23న ప్రదర్శన…
విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణవాసులెందరో ఏటా బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నారు. మన ఆటపాటల గొప్పతనాన్ని పరాయి దేశంలోనూ చాటిచెబుతున్నారు. అక్టోబర్ 23న ఎడారి దేశం దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించబోయే బతుకమ్మతో మరోమారు తెలంగాణ పేరు విదేశాల్లో మారుమోగనుంది. 2021లో కొవిడ్ 19 తీవ్రవిస్తృతితో భారతదేశం చిగురుటాకులా వణికింది. సెకండ్వేవ్తో గజగజలాడిన భారత్కు దుబాయ్ నైతిక మద్దతును ప్రకటించింది. ఏప్రిల్ 26న బుర్జ్ ఖలీఫాపై భారత జాతీయజెండాను ప్రదర్శించి మీకు మేమున్నామంటూ దుబాయ్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఆరునెలల తర్వాత మరోమారు ప్రపంచంలోనే అత్యంత పొడవైన బిల్డింగ్పై ఈ నెల 23న బతుకమ్మ పండుగ విశిష్టతలు ప్రదర్శించబడుతుండడం విశేషం. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పలువురు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.
బుర్జ్ ఖలీఫా విశిష్టతలివీ…
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనంగా బుర్జ్ ఖలీఫా గిన్నిస్రికార్డుల్లోకి ఎక్కింది. 1.5 బిలియన్ యూఎస్ డాలర్ల ఖర్చుతో 2004 జనవరి 6న బుర్జ్ ఖలీఫా నిర్మాణం మొదలు పెట్టారు. 2020 జనవరి 4న ప్రారంభించిన ఈ భవనం ఎత్తు 829.8 మీటర్లు. 33లక్షల 31వేల 100 చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మించిన ఈ భవనంలో మొత్తం 163 అంతస్తులున్నాయి. అత్యంత వేగంతో వెళ్లే 57 అధునాతన సాంకేతికతతో కూడిన లిఫ్టులను అమర్చారు. బుర్జ్ ఖలీఫా భవనంపై బతుకమ్మ పండుగ విశిష్టతలను ప్రదర్శించడం ద్వారా తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు మరోమారు యావత్ ప్రపంచానికి తెలియనున్నవి.