కోటగిరి అక్టోబర్ 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తున్నది. మం డలంలోని యాద్గార్పూర్, హంగర్గాఫారం, సోంపూర్, హెగ్డోలి, కొల్లూర్, ఎక్లాస్పూర్, టాక్లీ, ఎత్తొండ, పొతంగల్, కోటగిరి, కొడిచెర్లతోపాటు ఆయా గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించి మొక్కలను సంరక్షిస్తున్నారు. పల్లెలు, పట్టణాల్లోని ప్రధాన రహదారుల వెంట పూలు, పండ్లు నీడనిచ్చే మొక్కలు నాటగా, అవి ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. రోడ్ల వెంట వచ్చీపోయే వారికి కనువిందు చేస్తున్నాయి. టీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటి వృక్ష కానుక ఇచ్చారు. తాజాగా సీఎం కేసీఆర్ చేపట్టిన హరితనిధికి స్వాగతం పలుకుతూ మేము సైతం అంటూ అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలుకుతున్నారు.
భవిష్యత్ తరాలకు గొప్ప నిధి..
హరిత నిధి కోసం ఇచ్చే చిన్న మొత్తం భవిష్యత్ తరాలకు గొప్పగా ఉపయోగపడుతుంది. మంచి వాతావరణాన్ని రాబోయే తరాలకు అందించడం మన బాధ్యత. ఆరోగ్యాన్ని, పచ్చదనాన్ని పెంచే మహత్తర యజ్ఞంలో మమ్మల్ని భాగస్వాములు చేయడం ఆనందంగా ఉంది. తిర్మలాపూర్క్యాంప్లో నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారి చల్లని నీడనిస్తున్నాయి.
-ఉదయ్చంద్ర, తిర్మలాపూర్క్యాంప్ పాఠశాల ఉపాధ్యాయుడు, కోటగిరి