ఇందూరు, అక్టోబర్ 14: నిజామాబాద్ జిల్లాలో జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి అన్నారు. జిల్లా కేంద్రం శివారులోని నాగారంలో కేర్ ఫుట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమైన వహీద్ మెమోరియల్ జాతీయస్థాయి ఫుట్బాల్ టోర్నీ కొనసాగుతోంది. గురువారం నిర్వహించిన పోటీలను నవీన్ ఆచారి ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం మాట్లాడారు. నిజామాబాద్లో జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. వహీద్ పేరు మీద ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. క్రీడలను ప్రోత్సహించడం అంటే దేశభక్తి చాటడమేనన్నారు. నిజామాబాద్ నుంచి అన్ని క్రీడల్లో అంతర్జాతీయ క్రీడాకారులు తయారుకావడం చాలా గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఫహీమ్, ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఫాల్గుణ, కేర్ ఫుట్బాల్ అకాడమీ అధ్యక్షుడు నరాల సుధాకర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఆంద్యాల లింగం, కోచ్ గొట్టిపాటి నాగరాజు, సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారుడు గిరి, తెలంగాణ జాగృతి నాయకులు హరీశ్ యాదవ్, ఆకాశ్ పాల్గొన్నారు.
ఉత్కంఠగా సాగిన పోటీలు
రెండవ రోజు ఉదయం రెండు మ్యాచ్లు, మధ్యాహ్నం రెండు మ్యాచ్లను నిర్వహించారు. మొదటి మ్యాచ్లో చెన్నై జట్టు బెంగళూరు జట్టుపై 10-1 తేడాతో ఘన విజయం సాధించగా రెండవ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు కేరళ జట్టుపై 2-1తో విజయం సాధించింది. మధ్యాహ్నం మూడవ మ్యాచ్లో కేర్ ఫుట్బాల్ అకాడమీ జట్టు మధ్యప్రదేశ్ జట్టుపై 2-0 తేడాతో విజయం సాధించింది. నాల్గవ మ్యాచ్లో మహారాష్ట్ర జట్టు ఆంధ్రప్రదేశ్ జట్టుపై 1-0 తేడాతో విజయం సాధించింది.