జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అసమర్ధ పాలనలో సాగునీరందక రైతులు అరిగోస పడుతున్నారని, దీంతో గణపసముద్రం పరిధిలో వేలాది ఎకరాలకు సాగునీరందని పరిస్థితి నెలకొందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రామప్ప రిజర్వాయర్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా గణపసముద్రానికి నీటిని విడుదల చేసి పొలాలకు నీరందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన జయశంకర్ భూపాలపల్లిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు, దిగువన దేవాదుల ఎత్తిపోతల పథకం, సమ్మక సారక బరాజ్ల నిర్మాణం చేశామన్నారు.
దేవాదుల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సాగు, తాగునీరు అందించాలనే లక్ష్యంతో వీటిని నిర్మించామన్నారు. ఈ ప్రాజెక్టుల నుంచి ఏటా 180 రోజులు నీటిని సరఫరా చేయాలని, ప్రతినెలా 6 టీఎంసీల నీళ్లను ఎత్తిపోస్తే సాగు, తాగునీటి కి ఇబ్బంది ఉండదన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే అసమర్ధత, చేతగానితనంతో గణపురం ఆయకట్టు కింద పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొందని మండిపడ్డారు. దీనిపై జిల్లా మంత్రులు సీతక, కొండాసురేఖ, కరీంనగర్కు చెందిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వ్యవసా య, ఇరిగేషన్ శాఖల అధికారులతో చర్చించి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏ ర్పాట్లు చేయకపోవడం సిగ్గుచేటన్నారు.
గత రెండు నెలలుగా నెలకు 6 టీ ఎంసీల నీరు ఎత్తిపోస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా కేవలం 4 టీఎంసీల నీరు మాత్రమే ఎత్తిపోసినట్లు తమకు సమాచారముందన్నారు. దేవాదుల ఇన్టేక్ వెల్ నుంచి 9 పంపులు నడిపిస్తే భీంగణపూర్, రామప్ప, చలివాగు నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్ వరకూ నీళ్లు వెళ్తాయన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రామప్ప నుంచి నేరుగా గ్రావిటీ కెనాల్ ద్వారా గణపసముద్రానికి తీసుకురావడానికి అప్పటి సీఎం కేసీఆర్ సహకారంతో 2021లో రూ. 19.76 కోట్లు సైతం మంజూరు చేయించి పనులు పూర్తి చేయించామన్నారు. అనంతరం ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆ పనులను అలానే కొనసాగిస్తే ఈ సమస్య వచ్చేది కాదన్నారు. తాను కరోనా సమయంలో ము లుగు ఎమ్మెల్యే సీతక అడ్డుపడినా తాను దగ్గరుండి రామప్ప నుంచి గ్రావి టీ కెనాల్ ద్వారా గణప సముద్రానికి నీళ్లు తీసుకొచ్చానని వివరించారు. ప్రస్తుత ఎమ్మెల్యేకు రైతులకు నీళ్లివ్వాలనే మనసు ఎందుకు రావడం లేదన్నారు.
దీనిపై రైతులు అడిగితే మిషన్ భగీరథను ఎందుకు పెట్టనిచ్చారని అవగాహన లేని మాటలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా మంత్రులు ఆలోచించి రామప్ప నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా గణపసముద్రానికి నీటిని విడుదల చేసి ఆరు వేల ఎకరాలకు సాగునీరందించి రైతులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ అర్బన్ మాజీ అధ్యక్షుడు కటకం జనార్దన్, సొసైటీ చైర్మన్ మేకల సంపత్కుమార్ యాదవ్, కౌన్సిలర్లు పూర్ణచందర్, సతీశ్కుమార్, నాయకులు సెగ్గం సిద్దు, హరీశ్రెడ్డి, కుమార్, వాసాల రవి, సుధాకర్ పాల్గొన్నారు.