ఊట్కూర్ : సామ్రాజ్యవాదం, బడా పెట్టుబడిదారుల ( Capitalists ) దోపిడీకి వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా పోరాడాలని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ ( Massline ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.కృష్ణ ( Krishna ) పిలుపు నిచ్చారు.
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం బిజ్వార్లో రెండు రోజులుగా కొనసాగుతున్న పార్టీ జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల్లో భాగంగా సోమవారం ఆయన మాట్లాడారు. దేశంలో కోట్లాది మంది కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నప్పటికీ అధిక శాతం మంది అసంఘటిత రంగంలోనే ఉన్నారని వెల్లడించారు. వారికి కనీస వేతనాలు, ట్రేడ్ యూనియన్ హక్కులు, పని గంటలు, ఇతర సౌకర్యాలు అందడం లేదన్నారు.
మరోవైపు రైతాంగం విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ యంత్రాలు, మార్కెట్, రుణాల సమస్యలతో సతమతమవుతోందన్నారు. అమెరికా సామ్రాజ్య వాదంతోపాటు గుత్తాధిపత్య సంస్థలు మార్కెట్ను శాసిస్తున్నాయని విమర్శించారు. బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా విధానాలు రూపొందిస్తున్న పాలకులు రైతులు, కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
శిక్షణ తరగతుల్లో పార్టీ పని విధానంపై బి.రాము, కమ్యూనిస్టు పార్టీ చరిత్రపై ఎస్.కిరణ్ బోధించారు. పి.రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మక్తల్, నారాయణపేట డివిజన్ కార్యదర్శులు సలీం, కాశీనాథ్, జిల్లా నాయకులు కాలేశ్వర్, యాదగిరి, కిరణ్, బోయినపల్లి రాము, జయ, భగవంతు తదితరులు పాల్గొన్నారు.