కొండాపూర్, ఆగస్టు 8 : శేరిలింగపల్లికి చెందిన కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న దుర్గం శ్రీహరిగౌడ్.. తన నానమ్మ బతికుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించడమే కాకుండా, ఒక బాబాయ్ చనిపోగా, మరో బాబాయ్ బతికుండగానే చనిపోయినట్టు కట్టు కథలు చెప్పి వారి ఆస్తిని లాగేసుకున్న ఘరానా మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. తన మోసం బయటపడటం, రిజిస్ట్రేషన్ అయిన ఆస్తి కోర్టు వివాదంలో ఉందన్న కోపంతో శ్రీహరిగౌడ్ తన పిన్ని, ఆమె కొడుకును చితకబాదాడు.
ఘటన వివరాలు.. శేరిలింగపల్లి మండలం తారానగర్లో శ్రీహరిగౌడ్ నానమ్మ పేరున ఇల్లు ఉన్నది. ఈ ఇంటిపై కన్నేసిన శ్రీహరిగౌడ్, తన నానమ్మ బతికి ఉండగానే ఆమె చనిపోయినట్టు, బతికున్న మరో కుమారుడు పెండ్లి కాకుండానే చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సంపాదించాడు. తప్పుడు సర్టిఫికెట్తో ఇంటిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. విషయం తెలుసుకున్న బతికున్న బాబాయ్ కుటుంబం కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ ఇంటి పైఅంతస్థులో శ్రీహరిగౌడ్ కుటుంబం నివాసం ఉంటుండగా, కింది అంతస్తును బాబాయ్ కుటుంబం అద్దెకిచ్చింది.
ఇంటి వివాదం కోర్టులో ఉండగా, ఇల్లు తనకు దకకుండా బాబాయ్ భార్య మౌనిక, ఆమె కుమారుడు సాయిచరణ్ అడ్డుకుంటున్నారని వారిపై కక్ష పెంచుకున్న శ్రీహరిగౌడ్.. గురువారం ఇంటి వద్ద రిపేర్ పనులు చేయిస్తుండగా శ్రీహరిగౌడ్ తన సోదరుడు సతీశ్తో కలిసి వారిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో బాధితురాలు మౌనిక చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదేక్రమంలో తన పిన్ని మౌనిక నిత్యం తమ కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ తమ కుటుంబంపై దాడి చేసి పారిపోయినట్టు శ్రీహరిగౌడ్.. మౌనిక కుటుంబంపై ఫిర్యాదు చేశాడు. శ్రీహరిగౌడ్ కాంగ్రెస్ నాయకుడు కావడంతో కేసు నమోదుకు అంగీకరించని పోలీసులు, బాధితురాలి తరఫున పలువురు నిలిచి పోలీసులపై ఒత్తిడి చేయడంతో ఎట్టకేలకు పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.