స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, ఏప్రిల్ 6 : ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అని రాష్ట్ర శాసనభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. లక్షలాది మంది రైతుల కష్టాలు తీరే రోజు.. రైతుల కన్నీటిని గోదావరి నీటితో తుడిచే రోజు.. మహా అద్భుతం కండ్ల ముందు సాక్షాత్కరించిన రోజు అని పేర్కొన్నారు. పూర్వ వైభవం కోల్పోయిన నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు రెండు పంటలకు ఢోకా లేదని రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని వివరించారు. అపరభగీరథుడు సీఎం కేసీఆర్ పట్టుదలతో గోదావరి జలాలు వందల కిలోమీటర్లు వెనుకకు పయనించి కరువు పీడిత భూములను ముద్దాడుతున్నాయని తెలిపారు. అమోఘమైన ఇంజినీరింగ్ పరిజ్ఞానంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ వద్ద సముద్ర మట్టానికి వంద మీటర్ల ఎత్తు నుంచి 600 మీటర్ల ఎత్తులోని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలను తరలించి అక్కడి నుంచి హల్దీవాగు ద్వారా మంజీరలోకి తీసుకురావడం అద్భుతమన్నారు. మంజీరలోకి వచ్చే గోదావరి జలాలు నిజాంసాగర్ ప్రాజెక్టు చేరడం ద్వారా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆయకట్టు భూములకు తిరిగి పూర్వ వైభవం వచ్చినట్టేనని తెలిపారు. మంజీరా నదిపై ఎగువ ప్రాంతంలో కర్ణాటక, మహారాష్ట్ర ఇబ్బడిముబ్బడిగా ఆనకట్టలు కట్టడంతో కొన్నేండ్లుగా నిజాంసాగర్ బోసిపోతుందని.. వానకాలంలో సైతం నీరు లేక కళావిహీనంగా మారిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో కొండపోచమ్మ సాగర్ నుంచి కాళేశ్వరం జలాలను తరలించడంతో పూర్తి ఆయకట్టు స్థిరీకరణ ద్వారా రైతులకు మేలు జరుగుతుందని వివరించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల రైతాంగానికి ఏటా రెండు పంటలను సాగుచేసుకునే అవకాశం దొరకడంతో సాగునీటి కోసం తిప్పలు పడే దుస్థితి లేకుండా పోతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమోస్తది అని అన్న వారికి ఇదే సమాధానం అని తెలిపారు. సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ ద్వారా గోదావరి నీళ్లను నిజాంసాగర్ కు తరలించేందుకు హల్దీవాగుకు విడుదల చేసిన సంద ర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.